Balka Suman | దళిత జాతి కంచంలో కూడు లాగేసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. హుజూరాబాద్లో దళిత బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బాల్కసుమన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. దళిత బంధు ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదన్నారు. దళిత బంధు నిలిపివేత కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన బీజేపీని దళితులు వదిలి పెట్టరని స్పష్టం చేశారు.
దళిత జాతిని ఆదుకునే ప్రయత్నం చేయాలని బాల్కసుమన్ పిలుపునిచ్చారు. దళిత బంధు పథకాన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పారు. ఎన్నికల తర్వాత కొనసాగుతుందన్నారు. దళిత బంధుపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన బీజేపీ నైతిక బాధ్యత వహించాలన్నారు.
మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మసాయిపేటలో దళితుల భూములు లాక్కున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. కమలాపూర్లో దళితుల ఇండ్లు కూల్చిండన్నారు. బీజేపీ తెలంగాణశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ దళిత ద్రోహులని అభివర్ణించారు.
అంతకుముందు హుజూరాబాద్లో దళిత బంధు నిలిపేయాలని కేంద్రం ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఈ విషయమై తనకు వచ్చిన ఫిర్యాదుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.