దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని పద్మల్పురి కాకో ఆలయంలో దండారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ, ఇంద్రవెల్లి మండలం నిజాంగూడ, కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూరు(యు) మండలం ముంజిగూడకు చెందిన గుస్సాడీ బృందాల ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. సంప్రదాయ పూజలతో పాటు రేలా రేలా అంటూ గుస్సాడీ నృత్యాలు చేశారు. అనంతరం అమ్మవారికి రుబ్బిన పెసర్లు, మినుములు, బబ్బెరగారెలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయం సమీపంలో వంటలు చేసుకొని సామూహిక భోజనాలు చేశారు.