వరంగల్: కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. నాయకుడిని, పార్టీని విమర్శించే హక్కు ఉంటే జవాబు కూడా చెప్పే బాధ్యత ఉండాలన్నారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు తెరాస నేతలతో కలిసి దయాకర్రావు మాట్లాడారు. మద్దతు ధర ఇవ్వాల్సింది కేంద్రం అని.. కానీ, కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జల యజ్ఞం.. ధన యజ్ఞంగా మారిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయో కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మీ పాలనలో ఎందుకు గుర్తించలేదని, దళితుల గురించే మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని అన్నారు. పాలకుర్తికి వెళ్లడానికి కాంగ్రెస్ హయంలో మోకాలు లోతు గుంతలు ఉండేవని.. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో కనిపించడంలేదా? అని అన్నారు. రేవంత్రెడ్డి ఒక జోకర్.. ఒక ఐటమ్ సాంగ్ డ్యాన్సర్.. ఒక బ్రోకర్ అని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డిని నేనే జైళ్లో పెట్టించానని చెప్పిన వ్యక్తి.. జైలు నుంచి వచ్చాక నా ఇంటికి ఎందుకోచ్చావ్. టీడీపీలో ఉన్నప్పుడు ఆరోజే ఎందుకు ఈ విషయం చెప్పలేదని రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను నీలాగా పూటకో పార్టీ మారలేదు.. పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశాను. నన్ను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని దయాకర్ రావు అన్నారు.