సూర్యాపేట, జూన్ 2 : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వ్యవసాయ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, అందుకు వరి దిగుబడిలో రికార్డులే నిదర్శనమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో రాష్ట్ర 7వ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి అమరవీరుల స్తూపం వద్ద నివాలర్పించి ఆచార్య జయశంకర్సార్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 13 నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి మాత్రమే ఉండేదని, ఇప్పుడు అది కోటి మెట్రిక్ టన్నులకు చేరి దేశంలోనే రికార్డు సృష్టించిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి దిగుబడిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలేనని ప్రధాన కారణమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి సాగునీరు కాదు కదా, తాగునీటికి కూడా దొరకని పరిస్థితి ఉండేదన్నారు.
అటువంటి రాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత జలాలను అందిస్తూ యావత్ భారతదేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీటిని అందించిన ముఖ్యమంత్రి అపర భగీరథుడిగా మారారని కొనియాడారు. విద్యుత్ విషయంలో అద్భుతమైన విజయాలు సాధించిన సీఎం కేసీఆర్ 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తూ రైతాంగానికి దార్శనికుడిగా నిలిచారన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగుతున్నదని, పాలనలో దివంగత ఆచార్య జయశంకర్సార్ మనోభీష్టం ప్రతిబింబిస్తున్నదని తెలిపారు. రూ.40 వేల కోట్లతో సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, అదనపు కలెక్టర్లు మోహన్రావు, పద్మజారాణి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలిత, డీఆర్డీఓ కిరణ్కుమార్, సీపీఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.