నీలగిరి, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముందుచూపుతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు చేయూతనిస్తూ ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజలంతా భాగస్వాములైనప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను అవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమానికి ముందునుంచే పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని అన్నారు. స్వపరిపాలన, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షమేరకు ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి పదవులు త్యాగం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి 14 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. వేలాది మంది బిడ్డలు ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు వదిలారని, వారి త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు.
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు
కొవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని, ఆసరా పథకంతో వేల మందికి పింఛన్లు అందుతున్నాయని, ప్రతి పల్లె, పట్టణానికి మిషన్ భగీరథ పేరుతో మంచినీటిని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు వైద్యులు, మెడికల్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వారిని ప్రత్యేకంగా అభింనందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రభాగాన నిలిచారని పేర్కొన్నారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు, కళాశాలు నెలకొల్పినట్లు తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటు, యాదాద్రి భువనగిరిలో ఎయిమ్స్ సాధించినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో అనేక దేవాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భుపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్, అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్శర్మ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కోటి ఎకరాలకు సాగునీరు..
రాష్ట్రం ఏర్పాటు తర్వాత కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తితో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 85శాతం భూభాగానికి కావాల్సిన సాగునీరు, తాగునీటితోపాటు పారిశ్రామిక అవసరాలను తీర్చగలిగే ప్రధాన నీటి వనరుగా కాళేశ్వరం రూపుదిద్దుకుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం జలాలతోపాటు డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పనులు మమ్మురంగా సాగుతున్నాయన్నారు. రైతులకు రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయన్నారు. ధాన్యం సేకరణలో నల్లగొండ దేశంలోనే మొదటి స్థానంలోఉందని తెలిపారు. 2021-22 సంవత్సరంలో వానకాలంలో 7.20 లక్షల ఎకరాల్లో పత్తి, సన్నరకాలను సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. భవిష్యత్లో విద్యుత్ కొరత రాకూడదనే ముందుచూపుతో జిల్లాలో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నామన్నారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సరఫరా చేయడంతోపాటు 5వేల ఎకరాలకు ఒకటి చొప్పున 140 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్తో జిల్లాలో ఎంతోమంది యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు.