జేత్యాతండాకు చెందిన ధన్సింగ్ నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
దేవరకొండ, మే 19 : జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. మండలం జేత్యాతండాకు చెందిన రమావత్ ధన్సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ధన్సింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ఈఎన్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జేత్యాతండాకు చెందిన రమావత్ శక్రు, జాంకి దంపతులకు ఐదుగురు కుమారులు, ఐదుగురు కూతుర్లు. వారిలో ఒకరైన ధన్సింగ్ తండాలో 3వ తరగతి వరకు చదువుకొని, పైతరగతులకు 7 కి.మీ. దూరంలో ఉన్న దేవరకొండకు నడిచి వెళ్లేవాడు. దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన ఆయన.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పీజీలో ఎంఈ కోర్సు చేసి 1987లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో డీఈఈ ఉద్యోగం పొంది వివిధ విభాగాల్లో పని చేశారు. పదోన్నతి పొందుతూ ఈఎన్సీగా ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. కొంతకాలం కొనసాగేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈఎన్సీగా పనిచేస్తున్న ఆయన.. టీఎస్పీఎస్సీకి నియమితులయ్యారు.
కాగా, నలుగురు సోదరులు వ్యవసాయం చేస్తుండగా, ధన్సింగ్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేవారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో నియమించేందుకు సహకరించారని గ్రామస్తులు తెలిపారు.
పట్నంల పెద్ద ఉద్యోగం చేస్తుండంట
ధన్సింగ్ తండా నుంచి పట్నం పోయి సదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తుండని అందరూ అంటుండ్రు. చిన్నప్పటి నుంచి మంచిగా సదువుకొని పట్నం పోయి మా తండాకు సాయం అందించేటోడు. తండాకు వచ్చినప్పుడు అందరితో మాట్లాడి ఏం కావాలని పలుకరించేది.