గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండడంతో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ముందుకు వచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లాలోని చాలా గ్రామపం చాయతీల్లో వంద శాతం పన్నులు వసూలయ్యాయి.
-సూర్యాపేట, మే 11
గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను ప్రభుత్వం ప్రతి నెలా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో పాటు ఇంటి పన్నుల వసూలుకు కూడా ప్రత్యేక కార్యాచరణ అవలంభిస్తున్నది. ప్రతి సారి ఆర్థిక సంవత్సరం చివరిలో ఇంటి పన్నుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నది. ఈ ఏడాది కూడా ప్రత్యేక డ్రైవ్ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా గతేడాది బకాయిలు రూ. 61,09,537తో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 9,63,54,601(మొత్తం రూ.10,24,64,138) వసూ లు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. మార్చి చివరి నాటికి రూ. 8,63,40,177 వసులు చేయగా.. ఇంకా రూ.1,61,23,961 బకాయిలు ఉన్నాయి.
154 గ్రామపంచాయతీల్లో వందశాతం
జిల్లాలోని 23 మండలాలకు గానూ 21 మండలాల పరిధిలోని 154 పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు చేశారు. అత్యధికంగా ఆత్మకూర్(ఎస్) మండలంలో 25 గ్రామ పంచాయతీలు, చిలుకూరులో 16, చింతలపాలెంలో 2, చివ్వెంలలో 15, గరిడేపల్లిలో 2, హుజూర్నగర్ 11, జాజిరెడ్డిగూడెం 8, కోదాడ 10, మద్దిరాల 3, మఠంపల్లి 1, మేళ్లచెర్వు 6, మోతే 9, నడిగూడెం 1, నాగారం 6, నేరేడుచర్ల 9, నూతన్కల్ 4, పాలకవీడు 3, పెన్పహాడ్ 7, సూర్యాపేట 4, తిరుమలగిరి 5, తుంగతుర్తి మండలంలో 7 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నులను వసూలయ్యాయి.
7 మండలాలో 90 శాతానికి పైగా
ఇంటి పన్నుల వసూలు కేవలం 60 శాతం లోపు ఉండేది. కానీ జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో వసూళ్లు పెరిగాయి. కరోనా ఉధృతి ప్రారంభం కాకముందే జిల్లా వ్యాప్తంగా 84.26 శాతం ఇంటి పన్నులు వసూలు చేశారు. వంద శాతం టార్గెట్ చేయాలనే లక్ష్యంతో పని చేసినప్పటికీ కొవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. జిల్లాలోని 7 మండలాల్లో 90 శాతానికి పైగా ఇంటి పన్నులు వసూలు చేశారు. అత్యధికంగా చిలుకూరు మండలంలో 98.07 శాతం, తుంగతుర్తి మండలంలో 95.57 శాతం, ఆత్మకూర్(ఎస్)లో 94.28, అనంతగిరిలో 90.88, చివ్వెంల 94.73, హుజూర్నగర్ 94.10, మేళ్లచెర్వు 94.55 శాతం పన్నులు వసూలు చేశారు. అతి తక్కువగా నాగారం మండలంలో 52.90 శాతం మాత్రమే వసూలయ్యాయి.
గ్రామ అవసరాలకు వినియోగం
ఇంటి పన్నులు వసూలు చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీ అవసరాలకు వినియోగించుకోవాలి. ఈ నిధులు జనరల్ ఫండ్లో జమ అవుతాయి. పాలకవర్గం తీర్మానం ప్రకారం వాటిని ఖర్చు చేయవచ్చు. సిబ్బంది వేతనాలతో పాటు అవసరమున్న వాటికి వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో కరోనా కట్టడికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా పన్నులు బకాయి ఉన్న వారు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి.
-యాదయ్య , జిల్లా పంచాయతీ అధికారి, సూర్యాపేట