జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఏటికి అడ్డుకట్టలు వేసి నీటిని ఒడిసి పట్టేందుకు చేపడుతున్న చెక్డ్యామ్ల నిర్మాణాలు చకచకా పూర్తవుతున్నాయి. దీంతో అనేక చోట్ల జలకళ ఉట్టిపడుతున్నది. జిల్లా వ్యాప్తంగా 19 చెక్డ్యామ్లు నిర్మాణం అవుతుండగా ప్రధానంగా పాలేరు వాగుపై మూడు నెలల వ్యవధిలోనే తొమ్మిది చెక్ డామ్య్లు పూర్తి కావడం రాష్ట్రంలోనే రికార్డు. పాలేరు వాగుపై మొత్తం తొమ్మిది చెక్డ్యామ్లు నిర్మించాల్సి ఉండగా మార్చి చివరి వారంలో పనులు ప్రారంభమై ఇప్పటికే ఆరు చెక్డ్యామ్లు వంద శాతం పూర్తయ్యాయి. మరొకటి 95శాతం, మిగిలిన రెండు పదిహేను రోజుల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తయిన చెక్డ్యామ్లలో నీళ్లు పుష్కలంగా చేరడంతో సమీపంలో భూగర్భ జలాలు పెరిగి సుమారు 700 ఎకరాల ఆయకట్టుకు ఢోకా లేకుండా పోయింది.
సూర్యాపేట నియోజకవర్గంలోని మూసీ, పాలేరు వాగుల్లో ప్రతి ఏటా నీరు దిగువకు వెళ్తున్నా.. అమాయక రైతులు ఆ నీటిని ఒడిసి పట్టాలనే డిమాండ్ చేయలేదు. గతంలో అనేక ప్రభుత్వాల్లో నియోజకవర్గానికి చెందిన ఎంతో మంది ప్రజాప్రతినిధులుగా పనిచేసినా.. వాగుల్లో పోతున్న నీటిని ఆపేందుకు చెక్డ్యామ్లు నిర్మించాలనే ఆలోచనే చేయలేదు. కాగా, స్వరాష్ట్రంలో సూర్యాపేట కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో మంత్రి జగదీశ్రెడ్డి పలు అభివృద్ధి పనులను సీఎం ముందుంచారు. అందులో ఒకటైన చెక్డ్యామ్లను సీఎం వెంటనే మంజూరు చేశారు. రూ.120 కోట్లతో 19 చెక్డ్యామ్లు మంజూరు కాగా.. అధికారులు వెంటనే మూసీ, పాలేరు వాగులపై సర్వే చేపట్టి అనువైన ప్రదేశాలను గుర్తించి ఎస్టిమేషన్ పూర్తి చేసి టెండర్లు పిలిచి మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు.
రికార్డు స్థాయిలో పనులు..
చెక్డ్యామ్ పనులు అత్యంత వేగంగా పూర్తవుతూ రికార్డులు సృస్టిస్తున్నాయి. ఆన్లైన్ టెండర్ ద్వారా పాలేరు వాగుపై తొమ్మిది చెక్డ్యామ్లకు గాను ఏడింటిని దక్కించుకున్న డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ మూడు నెలల్లోనే ఆరింటిని పూర్తి చేసింది. మరొకటి 95శాతం పనులు పూర్తయ్యాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రెండు ఇతరులు చేస్తుండగా అవి కూడా నెల రోజుల్లో పూర్తికానున్నాయి. పూర్తయిన చెక్డ్యామ్ల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వాగు సాగుతూ నీళ్లు నిలుస్తున్నాయి. ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూరు, బొప్పారం టు లింగంపల్లిబాట, మిడ్తనపల్లి, గంగమ్మ దేవాలయం (మిడ్తనపల్లి), మక్తాకొత్తగూడెం, గౌస్తండాబాట, మక్తాకొత్తగూడెం (గంగమ్మ ఏనెకింద) పూర్తి కావస్తుండగా, చాకలిబండ (ఏపూరు), గుండ్ల సింగారంబాట వద్ద చెక్డ్యామ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అవి మరో నెల రోజుల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం పూర్తయితే పాలేరు వాగుపై 18కిలోమీటర్ల దూరం జలకళ సంతరించుకోనుంది. మూసీ ఏటిపై నిర్మిస్తున్న చెక్డ్యామ్ల పనులు సైతం ముమ్మరంగా జరుగుతున్నాయి. చెక్డ్యామ్ల వద్ద ఏడాది మొత్తం నీళ్లు నిల్వ ఉంటున్నందున చేపల పెంపకం ద్వారా మత్స్యకార్మిక కుటుంబాలకు జీవనోపాధి లభించనుంది.
పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి
పాలేరు, మూసీ వాగులపై చెక్డ్యామ్ నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్నిచోట్ల పనులు ప్రారంభం కాగా పాలేరు వాగుపై అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మొత్తం తొమ్మిది చెక్డ్యామ్లకు మార్చి చివరి వారంలో పనులు ప్రారంభం కాగా.. ఇప్పటికే ఆరు పూర్తయ్యాయి. మరొకటి 95శాతం పూర్తయింది. మరో రెండు నెల రోజుల్లో పూర్తవుతాయి. నిర్మాణాలు పూర్తయిన చోట ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరింది.
బిక్కేరు వాగుపై చెక్డ్యామ్ ఏర్పాటు సంతోషకరం
ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బిక్కేరు వాగుపై చెక్డ్యామ్లు నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. చెక్ డ్యామ్ల నిర్మాణంతో వాగులో నీళ్లు ఉండి చుట్టుపక్కల బోర్లు పుష్కలంగా పోస్తున్నాయి. ఈ సారి గతంలో కంటే ఎక్కువ సాగు చేస్తాం. వాగులో చెక్డ్యామ్ల నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి జగదీశ్రెడ్డికి రుణపడి ఉంటాం.
భూగర్భ జలాయి పెరిగాయి..
మా పొలాలు ఏటి వెంట ఉన్నా గతంలో నీళ్లు లేక ఎండిపోయేవి. చెక్డ్యామ్లు కట్టడం ద్వారా ఏటిలో నీళ్లు నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరిగి బోర్లు పుష్కలంగా పోస్తున్నాయి. నాకు రెండెకరాలున్నా నీళ్లు లేక ఆరేండ్ల నుంచి ఎకరం మాత్రమే సాగు చేస్తున్నా. ఈ సంవత్సరం ఏటిలో నీళ్లు ఉన్నాయి. మొత్తం సాగు చేస్తా.