నాగారం, ఏప్రిల్ 10 : మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన కడారి దిలీప్(14) మృతదేహం శనివారం లభించింది. శుక్రవారం సాయంత్రం బాలుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చి ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతైన విషయం విదితమే. సీఐ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలోని 12 మంది గజ ఈతగాళ్ల సాయంతో కాల్వలో గాలించారు.
రాత్రి జనరేటర్తో లైట్లను ఏర్పాటు చేసుకొని మరీ గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి విడుదలను నిలిపివే యించారు. దీంతో మండలంలోని గోపాల్రెడ్డినగర్ వద్ద బాలుడి మృతదేహం తేలింది. స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ హరికృష్ణ అక్కడికి వెళ్లి మృతదేహం దిలీప్దిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.