నేరేడుచర్ల, మే 30 : రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు మండలంలో పూర్తయ్యాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది. ఒక్కో రైతు వేదికను రూ.22లక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు. లాక్డౌన్ కారణంగా ప్రారంభం వాయిదా పడింది. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో నిర్మాణాలు పూర్తవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండంలోని 17 గ్రామపంచాయతీలను నాలుగు క్లస్టర్లుగా విభజించారు. జానల్దిన్నె, దిర్శించర్ల, చిల్లేపల్లి, కల్లూరులో రైతు వేదికలు నిర్మించారు. ఆన్లైన్లో నమోదైన వారి వివరాలు వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం 10,918 మంది రైతులు 24,720 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వారికి సలహాలు, సూచనలను ఈ వేదికల ద్వారా అందించనున్నారు.
నాలుగు క్లస్టర్లలోని గ్రామాలు…
జానల్దిన్నె ఏర్పాటు చేసిన రైతు వేదికలో నేరేడుచర్ల, జానల్దిన్నె గ్రామాల రైతులకు, చిల్లేపల్లి రైతు వేదికలో సోమారం, చిల్లేపల్లి, బోడల్దిన్నె రైతులకు, కల్లూరు రైతు వేదికలో పెంచికల్దిన్నె, కల్లూరు, మేడారం, దాచారం, యల్లారం, కల్వలదిన్నె, పత్తెపురం గ్రామాల రైతులు, దిర్శించర్ల రైతు వేదికతో ఆ గ్రామ ప్రజలకు లబ్ధి చేకూరనున్నది. ఈ వేదికల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర సమాచారం అందజేస్తారు. వీటిల్లో రైతులు, అధికారులు కూర్చొని చర్చించుకునేందుకు కావాల్సిన టేబుళ్లు, చైర్లు, మైక్ను సమకూర్చుతున్నారు.
పంటల సాగుపై సమగ్ర చర్చకు అవకాశం
పంటల సాగుపై రైతులకు వివరించడానికి రైతు వేదికలు చక్కటి వేదికలుగా ఉపయోగపడనున్నాయి. వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి వారి సమస్యలను పరిష్కరించడానికి సులభంగా ఉంటుంది. ఈ వేదికల ద్వారా సుమారు 10,918 మంది రైతులకు పంటల సాగుకు మెళకువలు, సలహాలు, సూచనలు చేసేందుకు వీలుంటుంది. రైతువేదికల నిర్మాణంతో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
రైతు వేదికలతో ఎంతో మేలు
ఆధునిక వ్యవసాయ విధానాలు, ప్రభుత్వ పథకాలు రైతులకు వివరించేందుకు ఈ వేదికలు ఎంతో దోహదపడుతాయి. పంటలను ఆశించే తెగుళ్లు, సస్యరక్షణ చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు అవకాశం కలుగుతుంది. రైతులు, అధికారులకు బహుళ ప్రయోజనాలు కలిగించేలా ఈ వేదికలు ఉపయోగపడుతాయి.
-వీరభద్రరావు, ఏఓ, నేరేడుచర్ల