కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ, మార్చి 28 : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో పోలీస్, రెవెన్యూ, ఎన్నికల సిబ్బందికి ఆదివారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీతోపాటు బహిరంగ ప్రదేశాలు, సభలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేసే సమయంలో విధిగా వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కోసం 08680-272837తోపాటు 1950టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన టోల్ఫ్రీ నంబర్కు దేశంలో ఏ ప్రాంతం నుంచి ఫోన్చేస్తారో సంబంధిత జియోగ్రాఫిక్ సిస్టమ్ ద్వారా అక్కడి అధికారులు ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన విధులకు హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు విధి నిర్వహణలో ఎలాంటి మినహాయింపులు ఉండవనే విషయాన్ని అధికారులంతా గుర్తించాలన్నారు. పోలీస్ బృందాలతో ఎన్నికల సిబ్బంది భాగస్వామ్యమై ఉండాలన్నారు. ఫ్లయింగ్ స్కాడ్స్ను నియమించినట్లు తెలిపారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ డబ్బు రవాణా విషయంలో ప్రాథమిక విచారణ చేసుకోవాలని , అదే సమయంలో అవసరాల నిమిత్తం డబ్బుతో వెళ్లే సాధారణ ప్రజలను ఇబ్బందికి గురిచేయవద్దని సూచించారు. ఇలాంటి సందర్భాల్లో ఉన్నతాధికారుల సూచనల మేరకు నడుచుకోవాలన్నారు. చెక్పోస్టుల వద్ద నిఘాతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ నర్మద, సాగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రోహిత్సింగ్, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎస్పీలు ఆనంద్రెడ్డి, రమణారెడ్డి, పీపీ ఉపేందర్రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల పరిశీలకుల నియామకం
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇద్దరు పరిశీలకులను నియమించినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. సాధారణ పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ రాహుల్సింగ్ను, వ్యయ పరిశీలకుడిగా మరో సీనియర్ ఐఏఎస్ వినయ్చౌదరిని నియమించినట్లు తెలిపారు. వీరు సోమవారం నుంచి సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు చెప్పారు.