ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 27 : కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తతే ఆయుధం లాంటిదని మండల వైద్యాధికారి డాక్టర్ ఆనంద్ సూచించారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మాస్కులు ధరించి భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ మల్సూర్నాయక్, ఎస్ఐ లింగం, ఆర్ఐ అంజయ్య, మర్ల చంద్రారెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, పన్నాల సంజీవరెడ్డి, తూడి నర్సింహారావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నిరంతరాయంగా ఆరోగ్య పరీక్షలు
కోదాడ రూరల్ : మండలంలోని కాపుగల్లు ఆరోగ్య కేంద్రంలో నిరంతరాయంగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుధీర్చక్రవర్తి తెలిపారు. మంగళవారం ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏఎన్ఎంలు తిరుపతయ్య, శ్రీనివాస్రావు, లక్ష్మీనర్సమ్మ, విజయలక్ష్మి, గోపమ్మ, ఇందిర, ప్రమీల, లక్ష్మీసుధ, భవాని, రూప, పద్మ, జీవమ్మ, విజయ్కుమార్, గాంధీరాజు పాల్గొన్నారు.
చివ్వెంల : కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏస్ఐ విష్ణుమూర్తి సూచించారు. మంగళవారం మండలకేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్ఐ అంతిరెడ్డి, సిబ్బంది ఉన్నారు.
హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
సూర్యాపేటలోని మార్కెట్ కార్యాలయం, రైతు విశ్రాంతి భవనం, కమీషన్దారులు, హమాలీలు, దడువాయిల కార్యాలయాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అలాగే గరిడేపల్లి మండలంలోని కుతుబ్షాపురంలో, మునగాల మండల కేంద్రంలో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు.
2గంటల వరకే సిమెంట్ దుకాణాలు
కోదాడ టౌన్ : కరోనా ఉధృతి నేపథ్యంలో పట్టణంలోని సిమెంట్ దుకాణాలను మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంచనున్నట్లు దుకాణాల అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
నేరేడుచర్ల, పెంచికల్ దిన్నెలో 270మందికి వ్యాక్సిన్
నేరేడుచర్ల : నేరేడుచర్ల, పెంచికల్దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం 270మందికి కరోనా వ్యాక్సిన్, 115మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు నాగయ్య, హరికిషన్ తెలిపారు. నేరేడుచర్ల పీహెచ్సీలో 160 మందికి వ్యాక్సిన్ వేయగా, 67మందికి కరోనా పరీక్షలు, పెంచికల్దిన్నెలో పీహెచ్సీలో 110మందికి వ్యాక్సిన్ వేయగా 48మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
చివ్వెంలలో 74 మందికి ..
చివ్వెంల : మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం 74మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి రాజ్కుమార్ తెలిపారు. 34మందికి పరీక్షలు చేయగా 9మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.
ఆత్మకూర్.ఎస్, నాగారంలో 100మందికి ..
ఆత్మకూర్.ఎస్/నాగారం : ఆత్మకూర్.ఎస్ పీహెచ్సీలో 70మందికి కరోనా టీకాలు వేసినట్లు డాక్టర్ ఆనంద్కుమార్ తెలిపారు. నాగారం పీహెచ్సీలో 30మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు సరళ తెలిపారు. అలాగే 30మంది పరీక్షలు చేయగా 9మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.
తిరుమలగిరి, చిలుకూరులో 34మందికి పాజిటివ్
తిరుమలగిరి/చిలుకూరు : తిరుమలగిరి పీహెచ్సీలో మంగళవారం 102మందికి కరోనా పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్ వచ్చిందని, 110మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యులు తెలిపారు. అలాగే చిలుకూరు పీహెచ్సీలో 25మందికి కరోనా పరీక్షలు చేయగా 12మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి ప్రమోద్కుమార్ తెలిపారు. 90 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు.
మునగాలలో 26మందికి పాజిటివ్..
మునగాల : మండల కేంద్రంతోపాటు మండలంలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగింది. మునగాల పీహెచ్సీలో 21మందికి కరోనా పరీక్షలు చేయగా నలుగురికి, రేపాల పీహెచ్సీలో 100మందికి చేయగా 22మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆయా కేంద్రాల వైద్యాధికారులు తెలిపారు. అలాగే మునగాలలో 60మందికి, రేపాలలో 50మందికి టీకా వేసినట్లు చెప్పారు.