ఉద్యమ గడ్డమీదే టీఆర్ఎస్ తొలి ప్లీనరీ, భారీ బహిరంగ సభ
జయశంకర్ సార్కు రాజీనామా పత్రాలు అందించిన గులాబీ దళపతి కేసీఆర్
2014లో సూర్యాపేట వేదికగా సమరభేరి
ఎన్నో యాత్రలు, పల్లె నిద్రలు..
స్వరాష్ట్రంలో అభివృద్ధి పథం.. టీఆర్ఎస్ వెంటే జనం
6 లక్షలకుపైగా సభ్యులతో తిరుగులేని పార్టీగా అవతరణ
నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్26(నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధన కోసం సాగిన ఎన్నో చారిత్రక ఘట్టాలకు అడ్డగా నిలిచింది… పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ. అప్పట్లో వెట్టిచాకిరి, బానిసత్వానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన పోరులోనూ తనదైన పాత్రను పోషించింది. సమైక్య రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయంపై ఉద్యమనేత, తెలంగాణ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పూరించిన పోరు శంఖంలో జిల్లా ప్రజలు వెన్నంటి నడిచారు. కేసీఆర్ సీఎం అయ్యాక నల్లగొండ జిల్లాలో అనేక అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు అమలువుతున్నాయి. నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం….
ఎదురులేని శక్తిగా టీఆర్ఎస్
2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేడు 20వ వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు ఆరున్నర లక్షల మంది సభ్యులతో ఎదురులేని శక్తిగా ఆవిర్భవించింది. 2014తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయబావుటా. 2014లో ఆరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానంలో విజయకేతనం ఎగరవేసిన పార్టీ 2018 ఎన్నికల్లోనూ 10 ఎమ్మెల్యే స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో సాగిన ప్రధాన ఘట్టాలను మననం చేసుకునే ప్రయత్నమే ఇది.
2002 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవానికి నల్లగొండ వేదికైంది. అమృతాగార్డెన్లో రెండు రోజుల ప్లీనరీ, కలెక్టరేట్ వద్ద అలకాపూరి కాలనీలో భారీ బహిరంగసభ ఏర్పాటు
క్లాక్టవర్ సెంటర్లో అమరవీరుల స్తూపానికి కేసీఆర్ శంకుస్థాపన.
2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 290 సర్పంచ్, భారీగా ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల కైవసం.
కృష్ణా జలాల్లో అన్యాయాన్ని ఎదురిస్తూ 2003 ఆగస్టు 26 నుంచి కోదాడలో కేసీఆర్ పాదయాత్ర ప్రారంభం. నాలుగు రోజల పాటు సాగిన యాత్ర హాలియాలో బహిరంగసభతో ముగియగా.. ఆయకట్టు ప్రజల్లో సాగునీటి వాటాపై చైతన్యం పెరిగింది.
ఎడమకాల్వ నీటి అన్యాయంపై టీఆర్ఎస్ జడ్పీ ఫ్లోర్లీడర్ సుదర్శన్రెడ్డి నల్లగొండ క్లాక్టవర్లో నిరవధిక నిరహారదీక్ష. కేసీఆర్తో పాటు తరలొచ్చిన ప్రముఖులు.
2004లో ఫ్లోరైడ్పై అధ్యయనం కోసం కేసీఆర్ రెండురోజుల బస్సుయాత్ర. మర్రిగూడ, నాంపల్లి, చండూర్, నార్కట్పల్లి మండలాల్లో పర్యటన. ఫ్లోరైడ్ బాధితుల కష్టాలతో చలించిపోయిన కేసీఆర్.
2004 ఎన్నికల్లో ఆలేరు నుంచి తొలిసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కుడుదుల నగేశ్ విజయం.
గుండె నిండా ఫ్లోరైడ్ బండా… తల్లడిల్లే నల్లగొండ అంటూ స్వయంగా కేసీఆర్ పాట రచన. ఎన్నో సభల్లో ప్రజలను కదిలించిన కేసీఆర్ పాట.
ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోని పీఏపల్లి మండలంలో తుంపరసేద్యాన్ని పరిశీలించి, సాగునీటి సమస్యను అధ్యయనం చేసిన కేసీఆర్.
2008లో కేంద్రంపై ఒత్తిడి కోసం ఎంపీగా ఉన్న కేసీఆర్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా. ఎన్జీ కాలేజీ వేదికగా ప్రొఫెసర్ జయశంకర్ సార్కు రాజీమానాల అందజేత.
2008లో జరిగిన ఉప ఎన్నికలో ఆలేరు నుంచి మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయకేతనం.
2009 డిసెంబర్లో కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం. కేసీఆర్ దీక్షాభగ్నంతో ఆత్మహుతికి పాల్పడిన యువకిషోరం కాసోజు శ్రీకాంతాచారి.
2014 నాటి వరకు కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపులో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా ప్రజలు. జిల్లా సరిహద్దుల మూసివేత. అన్ని వర్గాలతో ఉద్యమం.
2014లో కేంద్రం ప్రకటన అనంతరం సూర్యాపేటలో సమరభేరి సభ. లక్షలాదిగా వచ్చిన జిల్లా ప్రజలు. ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం .
2014 సాధారణ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్. భువనగిరి ఎంపీ స్థానంతో పాటు సూర్యాపేట, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు స్థానాల్లో విజయకేతనం.
2014లో తొలి మంత్రివర్గంలో జిల్లా నుంచి జగదీశ్రెడ్డికి ప్రాతినిథ్యం. కీలకమైన విద్యాశాఖ అప్పగింత. తర్వాత విద్యుత్ ఇతర శాఖల కేటాయింపు.
స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు. పాలన సౌలభ్యం కోసం మండలాల పునర్విభజన.
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు ఒక్కో మెడికల్ కాలేజీ చొప్పున మంజూరు.
ఫ్లోరైడ్కు మారుపేరైన మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో మిషన్భగీరథ పైలాన్కు కేసీఆర్ శంకుస్థాపన. నకిరేకల్ మండలం చందుపట్ల చెరువు నుంచి మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం. ఎడ్లబండిపై ముందుకు సాగిన అధినేత.
దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద 4400 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు శంకుస్థాపన.
కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు గోదావరి జలాల విడుదల. మూడు పంటలకు నిరాటంకంగా సాగునీరు.
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి.
ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు విడుదల.
దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు సాగునీటి కోసం మర్రిగూడెం మండలం శివన్నగూడెం వద్ద డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్.
స్వరాష్ట్రంలో కృష్ణానది నీటిలో మన వాటా పక్కాగా వినియోగం. రెండు పంటలకు సంవృద్ధిగా విడుదల.
ఆయకట్టులో మిగిలిన బీడుభూముల కోసం ఫిబ్రవరిలో 2600 కోట్లతో 13 లిఫ్టులు మంజూరు.
జిల్లాలో విస్త్రతంగా గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీల ఏర్పాటు. ఆదర్శపాఠశాలలతో పేద విద్యార్థులకు అండ.
2018 డిసెంబర్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో తొమ్మది ఎమ్మెల్యే స్థానాల్లో విజయకేతనం. 2019 అక్టోబర్లో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం. నకిరేకల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరిక. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని అధికారశక్తిగా నిలిచిన టీఆర్ఎస్. రెండోసారి మంత్రిగా జగదీష్రెడ్డి బాధ్యతలు.
2019లో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం ఏకపక్ష విజయాల నమోదు. మూడు జడ్పీ చైర్మన్ల పీఠాల కైవసం.
2021లోనూ ఆరున్నర లక్షల మంది సభ్యులతో జిల్లాలోనే పటిష్టమైన పార్టీ యంత్రాంగంతో టీఆర్ఎస్ ఎదురులేని పార్టీగా అవతరించింది.