నీలగిరి/ సూర్యాపేట సిటీ/ కోదాడ రూరల్, మే 25 : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని ఐజీ స్టీఫెన్ రవీంద్ర కోరారు. మంగళవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లాక్డౌన్ను ఆయన పర్యవేక్షించారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్, ప్రకాశంబజార్, డీఈఓ కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను పరిశీలించి ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇంటివద్దే ఉంటూ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అన్నారు. పోలీసులు రోడ్లపై ఉండి విధులు నిర్వహించేది ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐలు సురేశ్, చంద్రశేఖర్రెడ్డి, అనిల్, నాగదుర్గాప్రసాద్, ఎస్ఐలు నర్సింహులు, రాజశేఖర్రెడ్డి ఉన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా బారినపడిన పోలీసులను ఐజీ స్టీఫెన్ రవీంద్ర పరామర్శించారు. సూర్యాపేట పట్టణంలో పర్యటించి లాక్డౌన్ను పరిశీలించారు. కరోనా వైరస్ బారినపడిన కానిస్టేబుళ్లు సైదులు, ఆనంద్ ఇండ్లకు వెళ్లి పండ్లు, మందులు అందించారు. అనంతరం కోదాడ మండలం రామాపురం ఎక్స్రోడ్ వద్ద ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు చెక్పోస్టును పరిశీలించారు. సిబ్బందిని అభినందించి పండ్లు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు అందించారు. వారితోపాటు కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ఎస్పీ భాస్కరన్, కోదాడ డీఎస్పీ వాసు, కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ సైదులు, సిబ్బంది ఉన్నారు.