చిలుకూరు, మే 24 : జ్వర సర్వేలో కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. చిలుకూరు మండల కేంద్రంలో సోమవారం సర్వేను పరిశీలించి మాట్లాడారు. అనుమానితులు బయట తిరుగకుండా అవగాహన కలిపించాలని, వారికి రోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అవసరమైన వారిని జిల్లా కేంద్రానికికు తరలించాలని సూచించారు. కరోనా బాధితులు ఆధైర్య పడొద్దని, జిల్లా కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంచి ఆహారం, వ్యాయామంతో కరోనాను జయించవచ్చని సూచించారు. జర్వ సర్వేలో తాసీల్దార్ రాజేశ్వరీదేవి, ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ నర్సింహారావు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
సరిహద్దుల్లో ఈ-పాస్ పక్కాగా అమలు చేయాలి
కోదాడ రూరల్ : ఈ-పాస్ విధానం పక్కాగా అమలు చేయాలని, రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. రామాపురం క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వాహన తనిఖీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. అత్యవసర సేవల వాహనాలను అనుమతించాలని, పరిసర ప్రాంత ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచి వచ్చిపోయే వాహనాల వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ ఎల్.కిశోర్కుమార్, తాసీల్దార్ జె.శ్రీనివాస్శర్మ, పోలీసులు, అధికారులు ఉన్నారు.