కట్టంగూర్, మే 23 : కరోనా పేషెంట్లకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తూ పలువురు అండగా నిలుస్తున్నారు. కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి హోం క్వారంటైన్లో ఉన్న బాధితులను ఆదివారం పరామర్శించి గుడ్లు, పండ్లు, మందులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కరోనా బాధిత కుటుంబాల్లో మనోధైర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెరుకు నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని వల్లాల, ఆకారం గ్రామాల్లో కరోనా బారినపడి ఇండ్లలో ఉంటున్న వారికి మండల రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్ నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, మురారిశెట్టి కృష్ణమూర్తి, ఎర్ర యాదగిరి, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, కొన్రెడ్డి వేణుగోపాల్రెడ్డి, పనికెర కృష్ణయ్య, బైరు నాగరాజుగౌడ్ ఉన్నారు.
స్వేరోస్ ఆధ్వర్యంలో…
నల్లగొండ రూరల్ : మండలంలోని అనంతారం గ్రామంలో కరోనా పేషెంట్లకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహకారంతో 30మందికి ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు రవివర్మ ఆదివారం కరోనా కిట్లు అందించారు. కరోనాపై ఎలాంటి సందేహాలు ఉన్న హెల్ప్లైన్ నంబర్ 7997888888కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ ఉమా, ఆశ కార్యకర్త శ్రీలత తదితరులు ఉన్నారు.
లాక్డౌన్ పకడ్బందీగా అమలు
కట్టంగూర్ : మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు ప్రజలు తమకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేశారు. 10గంటల తరువాత ఈదులూరు, నల్లగొండ రోడ్డు, 65వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆదివారం కావడంతో మటన్, చికెన్ షాపుల వద్ద జనం గుమికూడారు. లాక్డౌన్ కారణంగా నల్లగొండ రోడ్డులోని రాంనగర్ వద్ద ఎస్ఐ బత్తుల శివప్రసాద్ ఆధ్వర్యంలో చెక్పోస్టు ఏర్పాటు చేసి పది తరువాత వెళ్లే వాహనాలకు జరిమానా విధించారు. పోలీసులు పలు గ్రామాల్లో పర్యటించి లాక్డౌన్పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలు సహకరించాలి : సీఐ సురేశ్
మునుగోడు : లాక్డౌన్కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని చండూరు సీఐ సురేశ్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని చౌరస్తాలో లాక్డౌన్ అమలు ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట ఎస్ఐ రజనీకర్, ఏఎస్ఐ యాదగిరి ఉన్నారు. అదేవిధంగా చండూరు మండలంలోని గట్టుప్పల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని సీఐ సందర్శించి పేషెంట్లతో మాట్లాడారు. కేంద్రంలో అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్ఐ ఉపేందర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. అనంతరం స్ట్రీట్ క్రాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 500 మెడికల్ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిమీటర్లను సీఐ సురేశ్, ఎస్ఐ ఉపేందర్రెడ్డి చేతుల మీదుగా గ్రామ యువతకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇడం రోజా, నామని నవీన్కుమార్, వాసు, హరీశ్, ప్రణవ్, వివేక్, భాస్కర్, కైలాసం, బీమగాని మహేశ్వర్ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : నల్లగొండ పట్టణంలోని పలు సంస్థలు, సంఘాల వారు అల్పాహారం, అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. సాహో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో రోగులు, వారి సహాయకులకు అన్నం, మజ్జిగను పంపిణీ చేశారు. అదేవిధంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జన్మదినం సందర్భంగా నల్లగొండ వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేశ్ 200మంది రోగులకు వారి సహాయకులకు, ఆసుపత్రి కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సుంకరబోయిన సత్యనారాయణ, అల్లి సుభాశ్, వెంకట్రెడ్డి, కిరణ్, ఉప్పునూతల వెంకన్న, వినేశ్, గణేశ్, వెంకన్న, కొండనాయక్ పాల్గొన్నారు.
మహిళకు అంత్యక్రియలు..
కట్టంగూర్(నకిరేకల్), మే 23 : నకిరేకల్ పట్టణానికి చెందిన ఓ మహిళ ఆదివారం కరోనాతో మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులతో కలిసి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి సొంత ఖర్చులతో అంత్యక్రియలు జరిపించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక అందించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.