కోదాడ రూరల్, మే 23 : లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయడంతో ఆంధ్రా సరిహద్దుల్లో పకడ్బందీ చర్యలు చేపట్టారు. అన్ని చెక్పోస్టుల్లో వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యవసర సర్వీసులు, ఈ పాస్ ఉన్న వాహనాలనే తెలంగాణలోకి అనుమతించారు. లాక్డౌన్ సడలింపు సమయంలోనూ ఇతర వాహనాలను రానీయలేదు. దీంతో ఆదివారం ఆయా చెక్పోస్టుల వద్ద ఆంధ్రా నుంచి వచ్చిన వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్డు వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి పోలీసు బలగాలతో అనుమతులు కలిగిన, అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించారు. అనుమతి లేని వాహనాలను నిలిపివేశారు. దీంతో చెక్పోస్టు వద్ద తెల్లవారుజాము నుంచే వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. వాటిని వెనుకకు పంపించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఉదయం పూట అధిక వాహనాలు వచ్చినా, తరువాత చెక్పోస్టు వద్ద జాతీయ రహదారి ఖాళీగా దర్శనమిచ్చింది.
దామరచర్ల : తెలంగాణ – ఆంధ్రా సరిహద్దులోని వాడపల్లి చెక్పోస్టు వద్ద రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆంధ్రా సరిహద్దులో వాడపల్లి పోలీసులు, చెక్పోస్టు వద్ద అదనపు బలగాలు పహారా కాస్తున్నాయి. ఆంధ్రా నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలను తనిఖీ చేశారు. అనుమతి లేని వాహనాలను తిప్పి పంపారు.
మఠంపల్లి : మట్టపల్లిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద పోలీసులు కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. అనుమతి లేని వాహనాలను నిలిపివేయడంతో అధిక సంఖ్యలో ఆగిపోయాయి. బైక్లపై వచ్చిన వ్యక్తులు పోలీసులతో వాగ్వాదం చేశారు. తెలంగాణలోకి రావాలంటే ఈ పాస్ తప్పనిసరిగా ఉండాలని, అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని ఎస్ఐ ఎల్లయ్య అన్నారు. లాక్డౌన్ మినహాయింపును ఆసరాగా తీసుకుని కొంతమంది అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారని తెలిపారు. అగ్రహారం, విలెంపేట, గుండ్లపల్లి, రామచంద్రాపురం నుంచి పుట్టి, మర పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నందికొండ : నందికొండ పైలాన్కాలనీలోని తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద సీఐ గౌరినాయుడు వాహనాల తనఖీని పరిశీలించారు. అనుమతిలేని వాహనాలను నిలిపివేశారు. ప్రజలు లాక్డౌన్ సమయంలో బయటకు రావద్దని, ఉదయం 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు అనుమతిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చేవారు ఈ పాస్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.