మేళ్లచెర్వు, జూన్ 21 : తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల్లో మోటారుసైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిలో కొడుకు పోలీసులకు చిక్కగా, తండ్రి పరారయ్యాడు. తెలంగాణలో చోరీకి పాల్పడ్డ ఏడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోదాడ రూరల్ సీఐ శివరామిరెడ్డి సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో మేళ్లచెర్వులో నాలుగుచోట్ల మోటారు సైకిళ్ల దొంగతనాలు జరుగగా ఆయా వాహనదారులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం కందిబండ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి మోటార్సైకిల్పై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతనిని పట్టుకొని విచారించగా తన పేరు గుంటిపల్లి చందు అని, తన తండ్రి వెంకటప్రసాద్తో కలిసి బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులను చూసి వెనుక కారులో వస్తున్న తండ్రి పారిపోయాడు.
చందును స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా రెండు తెలుగు రాష్ర్టాల్లో 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 18 బైకులు చోరీ చేసినట్లు అంగీకరించాడు. ఏపీకి చెందిన వీరిపై గతంలో అక్కడ పలు స్టేషన్ల పరిధిలో చోరీ కేసులు నమోదై జైలుకు వెళ్లి వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం గుంటూరు, కర్నూలు, నంద్యాల, గుత్తి తదితర ప్రదేశాల్లో 11 బైకులను అపహరించారు. అనంతరం ఖమ్మం జిల్లా మధిర మండలం దేశినేనిపాలేనికి మకాం మార్చి అక్కడ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ ప్రజల్ని నమ్మించి పరిసర ప్రాంతాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా మేళ్లచెర్వు, ఖమ్మంలో చోరీకి పాల్పడ్డ 7 బైకులను పోలీసులు రికవరీ చేశారు. వీటి విలువ రూ.3.30 లక్షలు ఉంటుందని, పరారీలో ఉన్న మరో నేరస్తుడు వెంకటప్రసాద్ కోసం గాలిస్తున్నామన్నారు. కేసును ఛేదించిన ఎస్ఐ నరేశ్, సిబ్బంది రామారావు, వెంకటేశ్వర్లును సీఐ అభినందించారు.