కొవిడ్ నిబంధనలతో తిలకించిన భక్తులు
నల్లగొండలో జిల్లా జడ్జి రమేశ్, ఎమ్మెల్యే కంచర్ల దంపతులు, నార్కట్పల్లిలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామగిరి, ఏప్రిల్ 21 : శ్రీరామనవమి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే ఆయా ఆలయాల పాలకమండలి సభ్యులు, అధికారులు, ప్రముఖుల మధ్య సీతారాముల స్వామి కల్యాణం నిర్వహించారు. నల్లగొండలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో అర్చక స్వాముల మంత్రోచ్ఛారణల మధ్య భద్రాచలం నుంచి వచ్చిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి,రమాదేవి దంపతులు మంగళవాయిద్యాల నడుమ సమర్పించారు. కల్యాణోత్సవంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ దంపతులు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, పాలకమండలి సభ్యులు, కౌన్సిలర్లు, ప్రముఖులు పాల్గొన్నారు. వీరందరికీ స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ కమిటీ చైర్మన్ చకిలంవేణుగోపాల్రావు సంధ్యారాణి దంపతులు అందజేశారు. నార్కట్పల్లి వారిజాల వేణుగోపాల ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. దామరచర్ల సీతారామచంద్ర ఆలయం, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి అన్ని ఆలయాల్లో కల్యాణ ఘట్టం నిర్వహించారు.