మర్రిగూడ/ చందంపేట, ఏప్రిల్ 21 :ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడింది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో మంగళవారం రాత్రి యరుగండ్లపల్లి, చర్లగూడెం, రాజపేటతండా, రాంరెడ్డిపల్లి, మర్రిగూడ గ్రామా ల్లో గాలి దుమారానికి రేకులు ఎగిరిపోయాయి. ఇండ్లల్లోని నిత్యావసరాలు తడిసిపోయాయి. పిడుగుపాటుకు కొండూరులో గడ్డం జంగయ్యకు చెందిన ఆవు, అంతంపేటలో జనగాం సైదులుకు చెందిన బర్రె చనిపోయింది. అంతంపేట, దామెర భీమనపల్లి, చర్లగూడెం, తమ్మడపల్లి, మర్రిగూడ, రాజపేట, కొండూరు, యరుగండ్లపల్లి, రాంరెడ్డిపల్లి, నామాపురం గ్రామాల్లో దాదాపుగా 195 ఎకరాల్లో వరిపంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. బుధవారం ఆర్ఐ బషీర్అలీ పలు గ్రామాల్లో పర్యటించి రేకులు కొట్టుకుపోయిన ఇండ్లను పరిశీలించి జరిగిన ఆస్తి నష్టాన్ని నమోదు చేసుకున్నారు. అలాగే విద్యుత్ తీగలు తెగడంతో పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చందంపేట మండలంలో మంగళవారం రాత్రి వివిధ గ్రామా ల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సుమారు 60 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.. చం దంపేట డిప్యూటీ తాసీల్దార్ ముఖ్తార్ మాట్లాడుతూ మోత్య తండాలో సుమారు 20 ఇండ్లకు ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయని తెల్దేవర్పల్లి, మోత్య తండాలో ఈదురు గాలులతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు చెప్పారు. నష్టాన్ని సేకరించి జిల్లా అధికారులకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో..
చివ్వెంల : మండలంలోని గుంజలూరు, బి.చందుపట్ల, మొగ్గయ్యగూడెం, జి.తిరుమలగిరి గ్రామా ల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మిర్చి, వరి పంటలు తడిశాయి. గుంజలూరు, తిరుమలగిరిలో వడగండ్లు పడ్డాయి.
పెన్పహాడ్: మండలంలోని చీదెళ్లలో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు విరిగి పడడం మూలంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేం ద్రంలో సుమారు కాంటా వేసిన సుమారు 2 వేల ధాన్యం బస్తాలు, రాశులు తడిసి ముద్దయ్యాయి. ధర్మాపురం, గాజుల మల్కాపురంలో కురిసిన వడగండ్ల వాన పడింది. అనంతారంలో వీచిన ఈదురు గాలులకు మేతకు వెళ్లిన బర్రెపై తాటిచెట్టు పడడంతో మృతి చెందింది. లింగాల గ్రామానికి చెంది న సుంకరి నాగభూషణానికి చెంది బర్రె మేతకు వెళ్లింది. గ్రామ పంచాయతీకి చెందిన మోటర్కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై మృతి చెందింది.
పాలకవీడు : గ్రామాల్లో వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీరు నిల్వడంతో ధాన్యం కొద్దిగా తడిచిపోయింది. గుడుగుంట్లపాలెం, పాలకవీడు, శూన్యపహాడ్, అలింగాపురం, బొత్తలపాలెం, జాన్పహాడ్, నాగిరెడ్డి గూడెం, రాఘవపురం కేంద్రాల్లో కాంటాలు వేసి తరలించని ధాన్యపు బస్తాలతో పాటు కాంటా వేయని ధాన్యం మోస్తరుగా తడవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. గుడుగుంట్లపాలెంలో 700 బస్తాలు కాటా వేసిన ధాన్యం, 500 బస్తాల రాశులు పోసిన ధాన్యం తడిచిందని రైతులు వాపోయారు.
హుజూర్నగర్: మండల వ్యాప్తంగా గాలిదుమ్ముతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో అక్కడక్కడా చెట్లు విరిగిపోయాయి. నెల రోజులుగా పెరిగిన ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం ఉపశమనం కలిగింది.
కోదాడ రూరల్ /చిలుకూరు/ మునగాల /మోతె: పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వం డగండ్ల వాన కురిసింది. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక మంది రైతుల ధాన్యం తడిసింది. చిలుకూరు మండలం నారాయణ పురంలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడి మంటలు వచ్చాయి. మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద కట్టెలమిల్లు రేకులు ఎగిరిపోయాయి. నామవరం, రాఘవాపురం గ్రామాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. మునగాల మండలం నర్సింహులగూడెంలో బొప్పాయి చెట్లు నేలకొరిగాయి.
నడిగూడెం: మండలం రత్నవరంలో పిడుగు పాటుకు గ్రామానికి చెందిన రాజుల వెంకటికి చెందిన 11, రాజుల అంజికి చెందిన 4, బెల్లంకొండ వెంకయ్యకు చెందిన 4 మిర్యాల శ్రీనుకు చెందిన ఒక మేక మృతి చెందింది. బృందావనపురం గ్రామ శివారులో తాటి చెట్లపై పిడుగు పడటంతో గీతకార్మికుడు మండవ శ్రీనివాస్తో పాటు మరోకరికి గాయాలయ్యాయి.
మేళ్లచెర్వు/ మఠంపల్లి : మేళ్లచెర్వు, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కల్లాలలో ఆరబోసుకున్న రైతులు పంటలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు.
గరిడేపల్లి : మండలంలో గడ్డిపల్లి, కుతుబ్షాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు తడవకుండా ఉండేందుకు పట్టాలను కప్పుకున్నారు. గరిడేపల్లిలో వానతో పాటు చిన్నపాటి రాళ్లు సైతం కురిశాయి. మంగాపురం గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో పిడుగుపడగా కొబ్బరి చెట్టుకు నిప్పంటుకుని కాలిపోయింది.