సూర్యాపేట టౌన్, మే 20 : వద్ద అధిక డబ్బు వసూలు చేసే ప్రైవేట్ దవాఖానలపై నిఘా పెంచామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవలు తప్పని సరిగా అవసరమున్న కొవిడ్ బాధితులను చేర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి పేషెంట్లు ఎక్కువగా వస్తున్నందున వసతులు కల్పించాలని సూచించారు. దవాఖానలో ఆక్సిజన్ వినియోగం, నిరంతర నీటి వసతి, విద్యుత్, పేషెంట్లకు అత్యవసర సేవలు తదితర అంశాలపై సమీక్షించారు. పట్టణంలో డ్రోన్ కెమెరా ద్వారా లాక్డౌన్ అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఎవరూ అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దవాఖానకు ఆక్సిజన్ ఫ్లో మీటర్ల అందజేత
నల్లగొండకు చెందిన కట్టా ఆర్గనైజింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వాహకులు సుధీర్, శాంతి రూ.1.80 లక్షల విలువగల 30 ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ను ప్రభుత్వ దవాఖానలో కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లాలో దాతలు, పారిశ్రామిక వేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ కళావతి, అడిషనల్ పీడీ సురేశ్, నోడల్ అధికారి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు