కనగల్, మే 18 : మండలంలోని ఆయా గ్రామాల్లో కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక పారిశుధ్య పనులు నిత్యం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 31 గ్రామ పంచాయతీల్లో 100మంది కార్మికుల వరకు పని చేస్తున్నారు. ప్రతిరోజూ వీధుల్లో శానిటైజేషన్ చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం షిప్టుల వారీగా పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చెత్తాచెదారం ఉన్నా తొలగించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడంతోపాటు రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పనులను పర్యవేక్షిస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా పంచాయతీ పాలకవర్గ సభ్యులు చాటింపు చేయిస్తున్నారు. అవసరంగా బయటకు వచ్చే వారికి జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సిన్ను వైద్య సిబ్బంది వేస్తున్నారు. గ్రామంలో హోం క్వారంటైన్లో ఉన్నవారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య సిబ్బంది, సర్పంచులు వివరిస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో కరోనా నియంత్రణకు ఇంటింటికీ జ్వర సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీంతో గ్రామాల్లో ఎవరికి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే తగిన మందులు అందిస్తున్నారు.
పల్లెను శుభ్రంగా ఉంచుతున్నాం
గ్రామంలోని వీధుల్లో మురుగుకాల్వల పూడికతీత, రోడ్లు శుభ్రం చేయడం, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ వంటివి చేస్తున్నాం. చెత్తను సేకరించి ట్రాక్టర్లో ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం.
ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపడుతున్నాం. చెత్తాచెదారాన్ని తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. గ్రామాల్లో శానిటైజేషన్ చేయిస్తున్నాం. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.