సూర్యాపేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో సూర్యాపేట జిల్లాలో రోగాలు మటుమాయం అవుతున్నాయి. నెలనెలా కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడింది. వీధుల్లో గుంతలు మటుమాయమై, ఎక్కడా మురుగు నీరు కనిపించకుండా పోతుండగా దోమలు, ఈగలు తగ్గిపోయాయి. మరోపక్క హరితహారంతో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతుంటే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరథ పథకం పూర్తి చేసి స్వచ్ఛమైన నదీ జలాలను తాగునీరుగా అందిస్తుండడంతో జ్వరాలు, డయేరియా, డెంగీ తదితర వ్యాధులు ఏటేటా తగ్గుతూ వస్తున్నాయి. కొవిడ్ కారణంగా పౌష్టికాహారం అలవాటు చేసుకోవడం, మాస్క్లు ధరించడంతోపాటు మనిషికి మనిషి దూరం ఉండడం కూడా వ్యాధులు తగ్గడానికి ఒక కారణమని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత, ఈ ఏడాది జిల్లాలో మలేరియా, స్వైన్ఫ్లూ జ్వరాలు జీరోకు చేరుకోగా సీజనల్గా వచ్చే జ్వరాలు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో 2017లో మలేరియా 23, డెంగీ 35, విష జ్వరాలు 16,308, డయేరియా 11,120 కేసులు నమోదైతే 2020లో మలేరియా 0, డెంగీ 11, విష జ్వరాలు 6004, డయేరియా 7086 కేసులు నమోదయ్యాయంటే వ్యాధులు ప్రబలడం ఏ స్థాయిలో తగ్గిందో తెలుస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో వర్షాకాలం వస్తుందంటే విషజ్వరాలు, డయేరియా, మలేరియా, డెంగీ వ్యాధులతో పల్లెలు మంచమెక్కేవి. చిరు జల్లులకే గ్రామాలు బురదమయంగా మారి వీధులన్నీ చిత్తడిగా అడుగు తీసి అడుగు పెట్టలేనంతగా ఉండేవి. దోమలు, ఈగలు ముసిరి అంటువ్యాధులు ప్రబలి గ్రామాలు, తండాల్లో ఇంటింటికీ మంచంపై చికిత్సలు పొందేవారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాలకు హుటాహుటినా వెళ్లి తాత్కాలికంగా గుంతలు పూడ్చడం, దోమల మందు పిచికారీ చేయడం మందులు ఇవ్వడంతోపాటు తాగునీటి ట్యాంకులు, పైపులు శుభ్రం చేసే బోర్లు, బావుల్లో క్లోరినేషన్ చేసేవారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, రెవెన్యూ తదితర శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేవారు. ఇంతచేసినా పల్లెలకు పల్లెలే వ్యాధులు బారిన పడుతుండడంతో ఉన్న సిబ్బంది సరిపోక ప్రజలు రోగాలతో సతమతమవుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసేవారు. నాడు ఆసుపత్రులు కిటకిటలాడేవి. అలాంటిది నేటి పరిస్థితి చూస్తే వందల కోట్లు వెచ్చించి గ్రామగ్రామాన దాదాపు ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం నెలనెలా నిధులు ఇచ్చి చేపడుతున్న పట్టణ, పల్లె ప్రగతితో పరిసరాలు పరిశుభ్రంగా మారడంతో సీజనల్ వ్యాధులు అరుదుగా కనిపిస్తున్నాయి.
భారీగా తగ్గిన సీజనల్ వ్యాధులు..
2019 సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించగా తదనంతరం ఏటేటా జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు భారీగా తగ్గాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ రికార్డులే చెబుతున్నాయి. దీనికి కారణం పల్లె, పట్టణ ప్రగతి పేరిట గుంతలు పూడ్చడం, పిచ్చిచెత్త ఎత్తివేయడం, పాత బావులు పూడ్చడం, మురికి కాల్వలు శుభ్రం చేయడం వంటి పనులతో పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా మారుతూ వ్యాధులు మటుమాయం అవుతున్నాయనేది నగ్నసత్యం. గత ఐదేళ్లలో సూర్యాపేట జిల్లాలో సీజనల్ వ్యాధుల సంఖ్యను పరిశీలిస్తే..
వ్యాధులు తగ్గుముఖం పట్టాయి..
గతంతో పోల్చితే గ్రామాల్లో పారిశుధ్యం చాలా బాగుంది. ప్రధానంగా మురికి గుంటలు, కాల్వల్లో చెత్త లేకపోవడంతో దోమలు, బ్యాక్టీరియా తగ్గిపోతూ సీజనల్ వ్యాధులు తగ్గాయి. కొవిడ్ కారణంగా ప్రజలు భౌతికదూరం పాటించడం, మాస్క్లు ధరించడంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటుండడం కూడా వ్యాధులు తగ్గడానికి ఒక కారణం.