నీలగిరి, మే 16 : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతున్నది. ఒక వైపు శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేప డుతూనే మరోవైపు కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ వైరస్పై సీఎం కేసీఆర్ సర్కారు బహుముఖ యుద్ధం చేస్తున్నది. కరోనా బారిన పడి ఇంట్లో ఉండడం వీలు కాని వారు ప్రభుత్వ దవాఖానల్లో చేరుతున్నారు. ఇలా ఆసుపత్రుల్లో చేరడం వల్ల రద్దీ పెరిగి ప్రాణాప్రాయం ఉన్న వారికి మంచాలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నల్లగొండ మండలం అన్నెపర్తిలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో ఐసొలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేసింది. కరోనా బారిన పడి ఎలాంటి ఇబ్బందులు లేని వారిని ఐసొలేషన్ కేంద్రానికి తరలించను న్నారు. ప్రస్తుతం 50 గదుల్లో 100 పడకలను ఏర్పాటు చేసింది. బాధితుల రద్దీకి అనుగుణంగా మరో 200 పడకలను పెంచేందుకు ఏర్పాట్లు సిద్ధ్దం చేశారు. మిగిలిన రెండు వందల పడకలు పాజిటివ్ రోగుల రద్దీకి అనుగుణంగా పెంచుతారు.
ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ
ఐసొలేషన్లో ఉండేవారి ఆరోగ్య పరిస్థ్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నర్సింగ్ స్టాఫ్లను కూడా నియమించింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న వారికి కనీస అవసరాలతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించనున్నారు.
సకల సౌకర్యాలతో ఐసొలేషన్
కరోనా రోగులకు చికిత్స అందించే ప్రభు త్వ ఆసుపత్రులు పాజిటివ్ రోగులతో నిండి పోయాయి. ఇంకా పాజిటివ్ బాధితుల సం ఖ్య పెరిగితే ఇబ్బంది కలుగకుండా ఉండడానికి ఐసొలేషన్ను సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం గదికి ఇద్దరు చొప్పున 50 గదుల్లో 100 పడకలను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో మంచం, పరుపులు, రెండు దుప్పట్లతో అన్ని రకాల వసతులను సమకూర్చింది. మహిళలు, పురుషులకు వేర్వేరుగా పడకలను ఏర్పాటు చేశారు.
పౌష్టికాహారం అందజేత…
పాజిటివ్ వచ్చిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకోవడానికి మందులు అందించడంతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు. స్టాఫ్ నర్సులు మూడు షిఫ్టులు విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేశారు. శ్వాస, ఆక్సిజన్ లెవల్స్ను పరిశీలించి అవసరమైతే ప్రభుత్వ దవాఖానకు తరలిస్తారు. 14 రోజుల క్వారంటైన్లో ఉదయం టిఫిన్, టీ, సాయంత్రం స్నాక్స్, టీ, రెండు పూటలా భోజనం, గుడ్డు, వారంలో రెండు రోజుల పాటు మాంసాహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
కరోనా బారిన పడి ఇంట్లో ఉండడానికి వీలు కాని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఐసొలేషన్ కేంద్రం సిద్ధమైంది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం మొదటి దఫాగా 50 గదుల్లో 100 పడకలతో ఐసొలేషన్ను సిద్ధం చేశాం. మరో 200 పడకలు పెంచుకునేందుకు వీలు ఉంది. ఇక్కడ ఉండే రోగుల కోసం మౌలిక సదుపాయాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
-ఎస్పీ రాజ్కుమార్, ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రం, ఇన్చార్జి