తుంగతుర్తి, మే 16 : ప్రజలంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించినప్పుడే కరోనా నివారణ జరుగుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం వెలుగుపల్లిలో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వేను సందర్శించి మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. 45సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానను త్వరలో ఐసొలేషన్ కేంద్రంగా మార్చనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జ్యోత్స్న, హెచ్ఈఓ సముద్రాల సూరి, సిబ్బంది గోవిందరెడ్డి, జానకమ్మ, సోమయ్య, యాదగిరి, భారతి, నర్సింహాచారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్నఇంటింటి జ్వర సర్వే
నాగారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆదివారం మండల కేంద్రంలో పంచాయతీరాజ్, ఆశ కార్యకర్తలు ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిప్పలపల్లి స్వప్న మాట్లాడుతూ సర్వేకు ప్రజలంతా సహకరించాలన్నారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కు ధరించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతను పాటించి వ్యాధుల బారి నుంచి కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెబోయిన భద్రయ్య, ఆశ వర్కర్లు యల్క రోజా, రేణుక, కారోబార్ చిప్పలపల్లి మల్లయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని చందుపట్ల గ్రామంలో రెండో విడుత జ్వర సర్వేను సర్పంచ్ కస్తూరి రాణి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 75 ఇండ్లల్లో సర్వే నిర్వహించగా.. ఒకరికి జ్వరం లక్షణాలు ఉండడంతో మెడికల్ కిట్ అందజేశారు. గ్రామంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి తరుణ్, అంగన్వాడీ టీచర్లు, అశ వర్కర్లు పాల్గొన్నారు.