సూర్యాపేట సిటీ, మే 15 : సూర్యాపేట జిల్లాలో నాలుగో రోజు లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6నుంచి 10గంటల వరకు లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలంతా తమకు కావాల్సిన నిత్యావసరాలు, కూరగాయలను తీసుకెళ్లారు. పది గంటల అనంతరం ఇండ్లకే పరిమితమయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లను, లాక్డౌన్ అమలు తీరును ఎస్పీ ఆర్.భాస్కరన్ పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. జిల్లాలో 144సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు బయటకు రావద్దన్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతిఒక్కరు తప్పకుండా పాటించాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని పేర్కొన్నారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి : సీఐ
నాగారం లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని సీఐ తూల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై శనివారం వాహనాలను ఆపి అనుమతి పత్రాలను పరిశీలించారు. నర్సింహులగూడెం సర్పంచ్ ధరావత్ గణేశ్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై వెళ్తుండగా వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సేవలకు వెళ్లేవారు గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ పి.హరికృష్ణ, ఏఎస్ఐ వెంకటేశ్వర్రెడ్డి, సిబ్బంది నరేశ్, యల్లయ్య, నాగరాజు ఉన్నారు. అర్వపల్లి మండలంలో ఎస్ఐ మహేశ్ లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానా విధించి అవగాహన కల్పించారు. గ్రామాల్లో లాక్డౌన్ సమయంలో దుకాణాలు తెరిచే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్లో ఎస్ఐ లింగం వాహనాలను తనిఖీ చేశారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాక్డౌన్ అమలు తీరును ఎస్ఐ ఎల్లయ్య పరిశీలించారు. పాలకవీడు మండలంలో ఎస్ఐ నరేశ్ పర్యవేక్షించారు. గ్రామాల్లోనూ ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, ప్రతిఒక్కరూ సిబ్బందికి సహకరించాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 10గంటల తర్వాత నేరేడుచర్ల పట్టణం – కోదాడ రహదారితోపాటు జాన్పహాడ్, రామాపురం రోడ్లు రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాల తనిఖీని రూరల్ సీఐ శివరాంరెడ్డి, ఎంవీఐ వీరేంద్రనాయక్, ఎస్ఐ పర్యవేక్షించారు.
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
కోదాడ లాక్డౌన్ ఉల్లంఘిస్తూ కొందరు వ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలో ఉదయం 10 గంటలకే షాపులన్నీ బంద్ చేస్తున్నారు. కానీ.. సొంత ఇంటి పక్కనే కిరాణా దుకాణాలు ఉన్నవారు విక్రయాలు కొనసాగిస్తున్నారు. మద్యం యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారు. మద్యం దుకాణాలు మూసేసినా గ్రామాల్లోని బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి వాటిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సరిహద్దు చెక్పోస్టు వద్ద టెంట్
కోదాడ రూరల్ సరిహద్దు రామాపురం క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం టెంట్ శనివారం సాయంత్రం వీచిన గాలులకు కూలింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ హెచ్ఏ సురేశ్, పలువురు ఆరోగ్య కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతగిరి వైద్యాధికారి శ్రీనునాయక్, యాతాకుల మధు