ఆత్మకూర్(ఎస్), మే 13 : ధాన్యం కొనుగోలు సమస్యలను మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో పరిష్కరిస్తున్నామని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నంద్యాలవారిగూడెం గోదాముల వద్ద ధాన్యం దిగుమతులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కూలీల కొరత కారణంగా దిగుమతుల్లో జాప్యం జరుగుతుందని, ధాన్యాన్ని మిల్లులకు పంపించినా మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ఆయా మండలాల్లోని గోదాముల్లో దిగుమతులు చేయాలని సూచించారని తెలిపారు. రహదారి సరిగా లేని ఆత్మకూర్(ఎస్) మండలంలోని గోదాముకు మంత్రి ఒక్క రోజులోనే రోడ్డు పర్మిషన్ చేయించారన్నారు. 40మంది బీహార్ కూలీలను తీసుకొచ్చి దిగుమతి చేపట్టామని, శుక్రవారంతో దిగుమతులు పూర్తవుతాయని తెలిపారు. దీంతో రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.