కూలీలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, చిరు వ్యాపారులు, హమాలీలు, వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజన పథకం ఎంతో ఉపయోగపడుతున్నది. సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇప్పుడు ఎంతో మంది కడుపు నింపుతున్నది. లాక్డౌన్ కారణంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో రూ.5 ఉన్న ఈ భోజనాన్ని ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్నారు.
రెండు కేంద్రాల ద్వారా..
ప్రభుత్వం సూచనతో సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రెండేండ్ల క్రితం రూ.5 అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చేవారు. లాక్డౌన్తో గత నెల 12 నుంచి పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లు కొద్ది సమయమే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రానికి ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు వచ్చే రోగులు, వారి సహాయకులు ఆహారం, టిఫిన్ల కోసం ఇబ్బంది పడేవారు. అంతేగాక కూలీలు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు కూడా తిండి కోసం అలమటించేవారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ క్యాంటీన్ను రెండు కేంద్రాలుగా విభజించి ఒకటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, మరొకటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాల్లో ప్రతిరోజూ ఉచితంగా 300 మందికి భోజనం అందిస్తున్నారు. ఆకలి తీర్చుకుంటున్న పేదలు ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇక్కడే భోజనం చేస్తున్నా
లాక్డౌన్ కారణంగా వ్యాపారం నిమిత్తం ఉదయాన్నే ఇంటి నుంచి వస్తున్నా. బయట తినాలంటే ఏమీ ఉండడం లేదు. మా ఇల్లు చాలా దూరం కావడంతో మధ్యాహ్నం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెట్టే భోజనంతోనే కడుపు నింపుకుంటున్నా. కరోనా వేళ నాకు ఇది ఎంతో ఆసరా అయ్యింది.
-నవీన్, పండ్ల వ్యాపారి, సూర్యాపేట
నాణ్యంగా..
ఈ భోజనానికి మున్సిపాలిటీ కొంత ఖర్చు భరిస్తూ సేవ చేస్తున్నది. నాణ్యత, రుచిలో రాజీ లేకుండా నిత్యం ప్రజల ఆకలి తీర్చుతున్నది. ఈ భోజనంలో పప్పు(50గ్రా), ఒక కూర(50 గ్రా), సాంబారు(100గ్రా), పచ్చడి(50 గ్రా), రైస్ 200 నుంచి 400(గ్రా) ఉంటాయి.
ఇంత కంటే గొప్ప సేవ ఏముంటుంది
కరోనా కారణంగా వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారు. వారాలు, నెలల తరబడి ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఆధ్వర్యంలో రెండు అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసినం. రోజుకు 300 మందికి భోజనం అందిస్తున్నాం. రోగులు, కార్మికులకు ఈ రకంగా సేవ చేయడం ఆనందంగా ఉంది.