ప్రభుత్వం ఆర్థిక భరోసా
వివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు
ఆలేరు టౌన్, జూన్ 10 : ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. విద్యార్థి దశ నుంచి వారిని ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లను అందిస్తున్నది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేయడమే కాకుండా స్వయం ఉపాధి స్కీం కింద రుణాలు అందజేసి జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది. అలాగే దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే వారికి ప్రోత్సాహకం కింద రూ. లక్ష ఇస్తున్నారు.
గతంలో రూ.50వేలు.. ప్రస్తుతం లక్ష..
సకలాంగులు దివ్యాంగులను పెండ్లి చేసుకుంటే గతంలో ప్రభుత్వం రూ.50వేలు అందజేసేది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రోత్సాహకాన్ని రూ.లక్షకు పెంచి అందజేస్తుంది. మనిషి జీవితంలో వివాహం ఎంతో ముఖ్యం. కొందరి విధిరాత, స్వయం కృపారాధనతో దివ్యాంగులుగా మిగులుతున్నారు. వారికి తమ కూతుర్లను, కుమారులను ఇచ్చి వివాహం చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. కుటుంబ పోషణ భారంగా ఉండటం తదితర కారణాలతో అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరించరు. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 50వేలు అందజేసేది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రోత్సాహకాన్ని రూ.లక్షకు పెంచింది. ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవాలంటే 45శాతం వైకల్యం ఉండి ఆధార్, రేషన్కార్డు, చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజీ సర్టిఫికెట్ జత చేసి వివాహం జరిగిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశుసంక్షేమ, వయోవృద్ధుల శాఖ కార్యాలయంలో అందజేయాలి. జిల్లాలో ఈ ఏడాది 12 మందికి వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.
స్వయం ఉపాధి కోసం రుణం..
దివ్యాంగులకు ఆర్థికంగా ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థిక పునరావాస పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రూ. 50వేల రుణాలు పూర్తిగా రాయితీ కింద ఇస్తారు. రూ.లక్షకు 80శాతం, రూ.2లక్షలకు 70శాతం, రూ. 3లక్షలకు 60శాతం రాయితీ కింద అందిస్తారు. జిల్లాలో ఈ ఏడాది 22 మందికి రూ.50వేల చొప్పున రుణాలు అందజేశారు. అలాగే విద్యావంతులైన దివ్యాంగులను ప్రోత్సహించేందుకు విద్య అర్హతను బట్టి ఉచితంగా పలు ఉపకరణలను అందిస్తున్నది. డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదువుతున్న శారీరక దివ్యాంగులకు పెట్రోల్తో నడిచే మూడు చక్రాల వాహనాన్ని అందిస్తారు. డిగ్రీ, ఆపై చదువుతున్న బధిరులకు 4జీ స్మార్ట్ ఫోన్లు, 9,10వ తరగతి చదువుతున్న అంధులకు ఎంపీ3 ప్లేయర్స్, డిగ్రీ ఆపై చదువుతున్న అంధులకు ల్యాప్టాప్లను అందిస్తున్నారు. అలాగే శారీరక వైకల్యం గల వారికి ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, చంక కర్రలు, అంధులకు చేతి కర్రలు, వినికిడి లోపం ఉన్న వారికి శ్రవణ యంత్రాలు మంజూరు చేస్తారు. వీరు తమ వైకల్యం తెలిపే సదరం ధ్రువీకరణ పత్రంతో జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే దివ్యాంగులకు ఆసరా స్కీం కింద రూ. 3,016 పెన్షన్ అందజేస్తున్నారు.
గుర్తింపు కార్డులు అందజేత..
జిల్లాలో 421 గ్రామపంచాయితీలు, 6 మున్సిపాలిటీల పరిధిలోని దివ్యాంగులకు భారత ప్రభుత్వం నుంచి 15,687 గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. భారత ప్రభుత్వం యూనిక్ నంబర్లతో గుర్తింపు కార్డులను అందజేసింది. ఈ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆధార్ నంబర్ మాదిరిగా వైకల్యం ఉన్నవారికి యూనిక్ కార్డులను అందజేసింది. ఈ కార్డు ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వం అందించే అన్ని రకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.