సీనియర్ ఇంటర్పరీక్షలు రద్దు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సర్కారు నిర్ణయం
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6813మందికి లబ్ధి
భువనగిరి అర్బన్, జూన్ 9 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో 2020-21 సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరం మార్చి 22న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జిల్లాలోని విద్యాసంస్థలను బంద్ చేశారు. ఆన్లైన్ క్లాసులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇంటి వద్దనే ఉంటూ విద్యార్థులు క్లాసులు వీక్షించారు. కాగా కొవిడ్ టీకా రావడంతో నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యాసంస్థలు ప్రారంభించగా కరోనా విజృంభించడంతో మార్చి 23 వరకు నిర్వహించిన కళాశాలలకు మార్చి 24 నుంచి తరగతుల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కళాశాలలకు బంద్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు వార్షీక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
కానీ కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ ఉధృతం అవుతుంది. ఇప్పటికే సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షలపై సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2020లో ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థులు 2020 మార్చిలో పరీక్షలు రాశారు. కానీ రెండో సంవత్సరంలో అడుగు పెట్టకముందే కరోనా మళ్లీ విజృంభించడంతో ఆన్లైన్ క్లాసులువింటున్నారు. కానీ 2021 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయాల్సిఉంది. కానీ కరోనా సెంకడ్వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో 2021 సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదనే నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సం చదువుతున్న విద్యార్థులు 14336 మంది ఉత్తీర్ణులయ్యారు.
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు…
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు-11, మోడల్ కళాశాలలు-7, కేజీబీవీ కళాశాలలు-5, రెసిడెన్షియల్ కళాశాలలు 9 ఉన్నాయి. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 7523, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6813 మంది ఉన్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సు చేసే విద్యార్థులు 5806, ఒకేషనల్ కోర్సు చేసే విద్యార్థులు 1717 మంది ఉన్నారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సు చేసే విద్యార్థులు 5452 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1361 మంది ఉండగా వీరు ఫీజు చెల్లించడంతో అందరూ ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 33 ఉండగా మొత్తం విద్యార్థులు 15వేలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.