హుజూర్నగర్, ఏప్రిల్ 8 : ఎక్కడైనా అభివృద్ధి కోసం అంతా కలిసివస్తారు. కానీ, హుజూర్నగర్లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పట్టణంలోని ప్రధాన రహదారిని సీసీగా మార్చేందుకు నిధులు మంజూరై పనులు ప్రారంభించగా వాటిని కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుకోవడం విడ్డూరంగా ఉన్నది. రోడ్డు మధ్యలో నుంచి మంచినీటి పైపులైన్ ఉండటం.. వాటి మీద నుంచి పెద్ద వాహనాలు పోయినప్పుడు పగిలి నీరు బయటకు రావడం.. గుంతల్లో నీరు నిలిచి ఎండిన తర్వాత దుమ్ము లేవడం.. ఇవన్నీ కొన్నాళ్లుగా జరుగుతున్నాయి. ఎన్నిసార్లు పైపులైన్లకు మరమ్మతులు చేసినా అవి పగిలిపోవడంతో మళ్లీ పాత పరిస్థితే. ఈ పరిస్థితి రాకూడదని మెయిన్రోడ్డును సీసీ రోడ్డుగా మార్చేందుకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.88లక్షలు, టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.4.45కోట్లు మంజూరు చేయించారు. పైపులైన్ వేసేందుకు గత నెలలో టెండర్లు పిలిచారు. ఈనెల 4న పనులను ప్రారంభించగానే కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుతగిలి పనులను నిలిపివేయించారు. మెయిన్రోడ్ బాగైతే టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పేరు వస్తుందన్న కుట్రతోనే ఈ పనులను ఆపుతున్నారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఎన్ఓసీ లేకుండా పనులేంటంటూ బెదిరింపులు..
టెండర్లు పూర్తయి.. నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభించగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మూడ్రోజుల క్రితం ఆర్అండ్బీ అధికారులకు ఫోన్ చేసి ఆర్అండ్బీ రోడ్డును తవ్వడానికి ఎన్ఓసీ ఇచ్చారా? ఎన్ఓసీ లేకుండా పనులు జరుగుతుంటే ఏమి చేస్తున్నారు? అని ఫోన్లో బెదిరించినట్లుగా సమాచారం. టెండర్లు కాకుండా పనులు ఎలా జరుగుతాయని, వెంటనే పనులను ఆపేయాలని, వర్క్ ఆర్డర్ చూపాలని అధికారులను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మొయిన్రోడ్డుపై పబ్లిక్ క్లబ్ వద్ద పనులు ప్రారంభం కాగానే కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి గలాటా చేసి పనులను అడ్డుకున్నారు. రోడ్డుపైనే మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. రోడ్డు పూర్తయితే దుమ్ముకు స్వస్థి పలుకవచ్చని ఎదురుచూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గలాటాను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
800మీటర్ల పొడవున సీసీ& మెయిన్రోడ్డును బాగు చేయాలంటే ముందుగా పైపులైన్ను సరిచేయాలి. ఇందుకుగాను ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 88లక్షలతో 12అంగుళాల(డయా కేసెవెన్)పైప్లైన్ను మున్సిపాలిటీ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు 1150మీటర్ల పొడవున వేయనున్నారు. ఈ పైప్లైన్ పూర్తయితే మట్టపల్లి బైపాస్ వరకు నీటి కొరత ఉండదు. పైపులైన్ పూర్తయిన తర్వాత తెలంగాణ అర్బన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిషన్ (టీయూఎఫ్ఐడీసీ)నిధుల నుంచి రూ.4కోట్ల 45లక్షలతో 800మీటర్ల పొడవున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో సీసీ వేయనున్నారు. ఇది 30ఏండ్లపాటు పాడవకుండా ఉండే అవకాశం ఉన్నది .
ఇవీ కూడా చదవండీ…
ధాన్యం కొనుగోలుకు 6,575 కేంద్రాలు
కారు ఆపి.. చిరు వ్యాపారితో మాట్లాడి..