అధికారుల సమీక్షలో మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట టౌన్, మే 7 : దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్కు కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కొవిడ్పై అనుసరించాల్సిన విధివిధానాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటింటా జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని, కరోనా అనుమానితులకు ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొవిడ్పై భయాందోళనకు గురి కావద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రెమ్డెసివర్ గురించి ఆందోళనకు చెందొద్దని, కరోనా నివారణకు అదొక్కటే మందు కాదని తెలిపారు.
వ్యాక్సిన్ సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, కేంద్రం రూపొందించిన యాప్లో నమోదు చేసుకున్న ప్రకారం వ్యాక్సిన్ ఇస్తారని మంత్రి స్పష్టం చేశారు. వినూత్న కార్యక్రమాలకు తెలంగాణ పెట్టింది పేరని.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధింగా ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేయడం సంచలనాత్మకమన్నారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి పరిస్థితిని బట్టి ఇంటివద్దనే అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వేకు ప్రజలంతా సహకరించాలన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాలు వేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రావొద్దని, మాస్కులు, శానిటైజర్లు వాడటంతోపాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్ రావు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీఎంహెచ్ఓ కోటాచలం, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ దండ మురళీధర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు.