-తిరుమలగిరి, జూన్ 4 :వర్షాకాలంలో పిడుగులు పడే అవకాశాలు అధికం. గ్రామీణ ప్రాంతాల్లో పిడుగు పాటుకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభమైంది. ప్రస్తుతం తుపానుల కారణంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. గడిచిన రెండు రోజుల్లోనే తుంగతుర్తి నియోజక వర్గంలో పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి చెందారు.
పిడుగుపాటుకు సంకేతాలివే..
ఆకాశంలో నల్లని మబ్బులు పట్టడం, మెరుపులు కనిపించటం, ఉరుములు వినిపించటం, వేగంగా గాలులు వీయటం పిడుగుపాటుకు సంకేతాలుగా భావించాలి.
పిడుగులు పడే ప్రాంతాలు
ఎత్తైన ప్రదేశాలు, కొండప్రాంతాలు, పొడవైన చెట్లు ఉన్న ప్రాంతాలు, సెల్ టవర్లు ఉన్న ప్రదేశాలు, ఎత్తైన విద్యుత్ స్తంభాలు, టవర్లు, టెలిఫోన్ స్తంభాలు, విడివిడిగా ఉండే చెట్లు, ఎత్తైన భవనాలు, బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
పత్రికలు, టీవీల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకోవడంతో పాటు స్థానికంగా అధికారులు చేసే హెచ్చరికలు పాటించాలి. గ్రామ శివారులో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. గోడలు, తలుపులు, కిటికీలకు, లోహపు వస్తువులు, వ్యవసాయ పంపుసెట్లకు దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే మోకాళ్ల మధ్య తల వంచి, రెండు చేతులతో చెవులు మూసుకొని భూమికి తగుల కుండా వంగి కూర్చోవాలి. ఎండిన చెట్లు, విరిగిన కొమ్మల వద్ద ఉండకూడదు. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి అందులోనే ఉండాలి.
చేయకూడని పనులు
ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ఆరుబయట ఉండకూడదు. ఆశ్రయం కోసం చెట్ల కిందికి వెళ్లకూడదు. నీటిలో ఉండకూడదు, లోహపు పైపుల నుంచి వచ్చే నీటిని తాకకూడదు. సెల్ఫోన్లు వినియోగించవద్దు, రేకుల షెడ్లు, తలుపులు లేని వరండాల్లో ఉండకూడదు. ట్రాక్టర్లు, బైక్లను ఆరుబయట నిలిపి ఉంచవద్దు. ఉరుములు, మెరుపులు తగ్గినా కనీసం 30 నిమిషాల వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకూడదు.