యాసంగి సీజన్లో ధాన్యాన్ని సేకరించడంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను అధిగమించిన జిల్లా అధికార యంత్రాంగం ఇక వేగంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నది. వరిలో ఈ సారి ఊస తిరుగుడు తెగులుతో వడ్లలో తాలు రావడంతో పాటు కొన్ని వడ్లలో పొట్టివి వచ్చాయి. ఈ నేపథ్యంలో మిల్లర్లు ఆ ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా కొర్రీలు పెట్టడంతో కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వగా ఉండి రాశుల కుప్పలు పేరుకుపోయాయి. దీంతో రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం మిల్లర్లకు నచ్చ జెప్పి ఒప్పించారు. మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా వచ్చిన ధాన్యం దిగుమతి చేసుకుంటుండడంతో ధాన్యం సేకరణ వేగవంతమైంది. ఈ సీజన్లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు అంచనా వేసి ఇప్పటి వరకు 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రెగ్యులర్గా 10వేల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 15 నుంచి 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల్లో ఇప్పటి వరకు ఆయా కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్లను మొత్తం కొనుగోలు చేస్తామని యంత్రాంగం చెప్తుంది.
15 వేల మెట్రిక్ టన్నులకు పైగా..
సాధారణంగా రోజుపది వేల మెట్రిక్ టన్నుల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ సారి జిల్లా వ్యాప్తంగా ఈ సారి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుండగా అందులో 1.89 లక్షల సన్న ధాన్యం కాగా 12వేల మెట్రిక్ టన్నులు ధాన్యం స్థ్దానిక అవసరాలకు పోతుంది. ఇక 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయగా మిగిలిన 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి 75 రోజుల సమయం పడుతుంది. అయితే ఇటీవల తాలు ఒడ్లని, పొట్టి ఒడ్లని మిల్లర్లు సకాలంలో దిగుమతి చేయక పోవడంతో లారీలు మిల్లుల్లో, ధాన్యం కేంద్రాల్లోనే ఉండి పోయింది. ఈ సమస్యలను జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగి పరిష్కరించడంతో ఆలస్యాన్ని పూడ్చిందుకు ప్రస్తుతం రోజుకు 15 నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా 360 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయా కేంద్రాల ద్వారా ఈ కొనుగోళ్లు చేపడుతున్నారు.
ప్రత్యేకాధికారుల నియామకం..
నాణ్యత పేరుతో మిల్లర్లు కొర్రీలు పెడుతుండడంతో వారికి నచ్చ జెప్పిన యంత్రాంగం మిల్లుకు వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడు దిగుమతి కావడానికి మిల్లుల వద్ద ప్రత్యేక అధికారులను విధుల్లో ఉంచింది. ప్రతి మిల్లు వద్ద వీఆర్వో లేదంటే వీఏఓలను నియమించి మిల్లులకు వచ్చిన ధాన్యం లారీని ఎప్పటికప్పుడే దిగుమతి చేయించాలని వారికి సూచించింది. దీంతో అన్ని మిల్లుల్లో ప్రస్తుతం ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి అవుతుంది. క్షేత్ర స్థ్దాయిలో కొనుగోలు చేసే పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్ కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యం మిల్లులకు తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 700 లారీలకు పైగా వినియోగిస్తున్నారు. ప్రధానంగా మిర్యాలగూడ డివిజన్లో కోతలు దాదాపు పూర్తి కావడంతో పాటు సేకరణ సైతం ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నందున అక్కడికే లారీలను ఎక్కువగా పంపిస్తున్నారు. అవసరమైతే కేంద్రాలతో పాటు మిల్లుల్లో అదనంగా హమాలీలకు ఎక్కవగా పెట్టుకుని ఎప్పటికప్పుడే ఎగుమతి దిగుమతి అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు చేశారు.
2.81 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ:
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా అందులో ఇప్పటి వరకు 2,81,126 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 36 659 మంది రైతుల నుంచి రూ. 530.77 కోట్ల విలువైన ధాన్యం సేకరణ చేయగా అందులో 4146 మంది రైతులకు రూ. 65.77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా నేడు మరో రూ.136.96 కోట్లు జమ కానున్నట్లు సివిల్ సప్లయ్ యంత్రాంగం చెప్తుంది. డీఆర్డీఏ పరిధిలోని ఐకేపీల ద్వారా 193 కేంద్రాలు, సహకార శాఖ పరిదిలోని పీఏసీఎస్ల ద్వార 153 కేంద్రాలు, మార్కెటింగ్ శాఖ ద్వారా మరో 14 కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేస్తున్నారు. ఈ సారి గతానికి మించి ధాన్యం సైతం ఒకే సారి పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలకు రావడంతో రాశులు పెద్ద ఎత్తున నిల్వ ఉంటున్నాయి. గ్రామాల్లో వరికోత మిషన్లు పెరగడం మూలంగానే పంట ఉత్పత్తి ఏక కాలంలో వస్తున్నట్లు అధికారులు అంటున్నారు.