సూర్యాపేట : ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు తునికి కొమర గౌడ్ (52) రోజువారీగా కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ఈదురుగాలులకు ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.