హైదరాబాద్ : ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు క్రస్టుగేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సూర్యాపేట-గుంటూరు జిల్లాల సరిహద్దులోని పులిచింతల జలాశయానికి వరద పొటెత్తుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.23 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 3 లక్షల 47వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కులను కేటాయించారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 41.38 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటం, గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. పులిచింతల క్రస్టుగేట్లు ఎత్తడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగింది.