సూర్యాపేట: జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మాస్కులను సైతం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని 23 మండలాల మండల స్థాయి అధికారులతో పాఠశాలలు పునఃప్రారంభంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1278, కళాశాలలు 72 ఉన్నాయన్నారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అధికారులు ఈ నెల 30 లోగా పారిశుద్య పనులు చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాలకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యాసంస్థల్లో ఉన్న మరుగుదొడ్లను శుభ్రం చేయడం , నీటి ట్యాంకుల శుద్ధి, తరగతి గదులను శుభ్రం చేయాలన్నారు. పారిశుధ్య పనులను అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ పనులను గ్రామ పంచాయతీ, మున్సిపల్ నిధులతో చేపట్టాల ని ఆదేశిం చారు. పాఠశాలలో టీచర్లు వంద శాతం హాజరుకావాలన్నారు. ముందస్తుగా పిల్లల తల్లిదండ్రులకు పాఠశాలల పునః ప్రారంభోత్సవ సమాచారం అందించాలని చెప్పారు. మాస్కులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
పాఠశాలలో ఉన్న కిచన్ షెడ్స్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. తరగతి గదులు వెలుతురు ఉండేలా చూ డాలన్నారు. పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలు నిరంతరం ఉండాలని చెప్పారు. ఈ నెల 30 నాటికి అన్ని పనులు పూర్తి చేసి దృవీకరణ పత్రం అందించాలని ఆదేశిం చారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలో కరోన లక్షణాలు ఉంటే వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
దోమల వలన వచ్చే డెంగీ, మలేరియా కేసులు నమోదు కాకుండా ఫాగింగ్, యాంటీ లార్వా మందులను ఉపయోగిం చాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఎస్. మోహన్రావు , జడ్పీ సీఈవో ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీవో కిరణ్ కుమార్, డీయం సివిల్ సప్లయ్ రాంపతి నాయక్, విద్యాశాఖ ఏడీ సాహితీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.