కోదాడ: గులాబీ జెండానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధ వారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఇప్పుడు యావత్ భారతదేశానికి రోల్ మోడల్గా మారిందని చెప్పారు. పార్టీ ప్రభుత్వం రెండూ వేరు వేరూ కాదని పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నది గులాబీ సైన్యం గుర్తించాలన్నారు.
ఎన్నికల మ్యానీఫెస్టోలో అమలు చేస్తామన్న పథకాలన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పథకాలన్ని టీఆర్ఎస్ పార్టీ రూపొందించినవేనన్నారు. యావత్ దేశంలో తెలంగాణాను ముందు వరుసలో ఉంచిన ము ఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతికత ఏ ఒక్కరికీ లేదన్నారు. అటువంటి పార్టీల జెండాలు ఇప్పటికీ అక్కడక్కడా కని పిస్తున్నాయన్నారు. అటువంటి పార్టీలకు తెలంగాణలో కాలం చెల్లిందని. ప్రతీ చోట ఎగరాల్సింది ఒక్క గులాబీ జెండాయే అన్నారు.
అక్కడక్కడా ఎగురుతున్న జెండాల పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో ఆసరా ఫించన్, రైతుబంధు, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటి పథకాలు అమలవుతున్నాయా అన్నది గులాబి సైన్యం తెలుసుకుని ప్రజల కు తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
2014కు ముందున్న పార్టీలు రాష్ట్రంలో ఎంత వరకూ అభివృద్ది చేశాయో ప్రజలు గుర్తించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు. సీఎం కేసీ ఆర్ పార్టీలకతీతంగా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అజయ్కుమార్ పాల్గొన్నారు.