పార్లమెంట్లో పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటన
సీజన్ మారే నాటికి రూ.15 పెంపు
ఉమ్మడి జిల్లా రైతాంగంపై రూ.101 కోట్ల అదనపు భారం
సూర్యాపేట, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఎప్పుడు పెరుగుతుందో, ఎంత పెరుగుతుందో అర్థమవనివ్వకుండానే సామాన్యుడి వెన్ను విరుస్తున్నాయి డీజిల్ ధరలు. వ్యవసాయం ప్రధానాధారమైన ఉమ్మడి జిల్లాపై ఈ ప్రభావం విపరీతంగా పడుతున్నది. సాగులో యాంత్రీకరణ పెరిగి.. దుక్కి దున్నడం మొదలు పంటకోత వరకు యంత్రాలపైనే ఆధారపడుతున్న తరుణంలో అడ్డగోలుగా పెరుగుతున్న ధరలు రైతుకు శరాఘాతంగా మారుతున్నాయి. ఆరు నెలల కింద యాసంగి ప్రారంభంలో లీటరు 83 రూపాయలున్న డీజిల్.. ఇప్పుడు 98 రూపాయలకు చేరింది. ఉమ్మడి జిల్లాలో సాగు అంచనా 23,39,297 ఎకరాలు కాగా, సగటున ఎకరాకు 29 లీటర్ల డీజిల్ ఖర్చవుతున్నది. తాజా రేటు ప్రకారం చూసినా.. యాసంగితో పోల్చితే రైతాంగంపై 101కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నది. ప్రస్తుతానికి ‘ఆరుతడి’ విత్తడం చివరి దశలో ఉండగా, యంత్ర వినియోగం ఎక్కువగా ఉండే వరి నాట్లు 15 శాతమే పూర్తయ్యాయి.
పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతుండడంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై పడి ధరలుఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా డీజిల్ ధరలు రైతులకు శరాఘాతంగా మారాయి. ఇటీవల పార్లమెంట్లోనే పలువురు ఎంపీలు డీజిల్ ధరలపై లేవనెత్తగా ఆరు నెలల్లో 66 సార్లు పెరిగినట్లు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన విషయం విదితమే. గత యాసంగి సీజన్ (ఫిబ్రవరి)లో లీటరు డీజిల్ ధర రూ. 83 ఉండగా వానకాలం సీజన్ నాటికి ఆరు నెలల్లో లీటరుకు రూ.15లు పెరిగి రూ.98కి చేరుకుంది. కూలీల కొరతతో పాటు వ్యవసాయంలో యాంత్రీకరణ ఫలితంగా డీజిల్ వాడకం పెరిగింది. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా రైతాంగంపై అదనపు భారం పడుతున్నది. ఈ ఏడాది యాసంగి నుంచి వానకాలం సీజన్ నాటికి పెరిగిన డీజిల్ ధరలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 23.39 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల కోసం రైతులపై రూ.101 కోట్ల అదనపు భారం పడుతున్నది.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి. అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను జోడెడ్లలా సమాంతరంగా పరుగులు పెట్టిస్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుండగా మరో పక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్రం ఇస్తున్న డబ్బులు ఆవిరవుతున్నాయి. నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడికి వాహనం నడిపే పరిస్థితి లేకుండా పోతున్నది. ఇక రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతున్నది. ఉమ్మడి జిల్లాలో 23,39,297 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉండగా కృష్ణా, గోదావరి, మూసీ, డిండి అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుండడంతో పాటు వర్షాలు పు ష్కలంగా కురుస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారి ప్రతి ఇంచు భూమిని సాగు చేస్తున్నారు. కానీ కేంద్రం విధానాలతో డీజిల్ ధరలు పెరుగుతుండడంతో నొప్పి తెలియకుండానే రైతులకు బాధ కలిగిస్తున్నది.
రూ.101 కోట్ల భారం
యాంత్రీకరణ వైపు రైతులు మొగ్గు చూపుతుండడంతో దుక్కులు దున్నడం నుంచి పంట కోసి విక్రయించే వరకు యంత్రాలనే వినియోగిస్తున్నారు. యంత్రాలకు డీజిల్ వినియోగిస్తుండడం. డీజిల్ ధరలు పెరుగుతుండడంతో రైతులపై భారం పడుతున్నది. ఈ ఏడాది యాసంగి నుంచి వానకాలం పంటలు వేసే సమయానికి పెరిగిన డీజిల్ ధరలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల రైతులపై అదనంగా రూ. 101 కోట్ల భారం పడుతున్నది.సాధారణంగా ఎకరా భూమి సాగు చేసేందుకు తొలి నుంచి పంటను హార్వెస్టింగ్ చేసేందుకు ఆరు గంటల పాటు ట్రాక్టర్ను వినియోగిస్తారు. అలాగే పంట కోసేందుకు హార్వెస్టర్, మధ్యలో మందుల పిచికారీకి స్ప్రే చేసేందుకు 2.15 గంట సమయం పడుతుంది. అంటే రైతులు ఎకరాకు సుమారు 8.15 గంటల పాటు యంత్రాల వినియోగిస్తున్నారు. వీటన్నింటికీ కలిపి దాదాపు 29 లీటర్ల డీజిల్ ఖర్చవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన రైతు తమ ప్రతి ఎకరానికి వెచ్చించాల్సిందే కానీ డీజిల్ ధరలు పెరుగుతుండడంతో ప్రతి ఎకరాపై వారిపై అదనపు భారం పడుతుంది. యాసంగి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరిలో డీజిల్ లీటరు ఒక్కంటికీ రూ.83.46 ఉండగా వానకాలం నాటికి నేడు 98.01 ఉండగా రూ.15 పెరిగింది. ఈ లెక్కన ఒక్క ఎకరాకు వినియోగించే 29 లీటర్లకు కలిపి గతంతో పోల్చుకుంటే రూ.435ల అదనపు భారం పడుతుంది. ఈ లెక్కన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 23.39లక్షల ఎకరాలకు 101 కోట్ల అదనపు భారం పడుతుంది.
ఈ సీజన్లోనే మరింత భారం తప్పందా..!
వానకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు ఆరు తడి పంటలు మాత్రమే వేస్తుండగా వరి నాట్లు కేవలం 15 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికే డీజిల్ ధరలు పెరుగుతూ వస్తుండగా మరో 30 నుంచి 45 రోజుల్లో వరినార్లు పూర్తి కానున్న నేపథ్యంలో డీజిల్ ధరలు మరింత పెరిగి రైతులపై అదే స్థాయిలో అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో 6,81,108ల్లో పంటలు వేయనుండగా వీటిలో 4,30,544 ఎకరాల్లో వరి అంచనాలకు ఇప్పటి వరకు కేవలం 6 వేల ఎకరాల్లో మాత్రమే పూర్తయింది. నల్లగొండ జిల్లాలో 12,19,867 ఎకరాల్లో సాగుకు గాను 3,53,800 ఎకరాల్లో వరి వేయనుండగా 52,000 పూర్తయింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,38,322 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు 2,23,250 ఎకరాల్లో వరి అంచనాలకు గాను 12,250 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఇతర పంటలు మాత్రం దాదాపు 50 నుంచి 60 శాతం పూర్తి కాగా లక్ష్యానికి మించి వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ధరల ప్రభావం ఇలా..
తిరుమలగిరి : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో యంత్రాల యజమానులు సైతం ధరలు పెంచారు. గతంలో ఎకరం పొలం సాలు, ఇరు వాలు దున్నితే రూ.1400 ఉండేది ప్ర స్తుతం రూ. 2 వేలు పెరిగింది. బురద పొలం నాలుగు సాళ్లు దున్నితే రూ. 5 నుంచి రూ.7వేల కు పెరిగింది. గొర్రు ఎకరం 1500 నుంచి 2000, రోటవేటర్తో రూ.4 నుంచి 5 వేలు పెరిగింది. పత్తి కర్ర తీయడానికి గతంలో ఎక రం 600 ఉంటే ప్రస్తుతం రూ.1000 పెరిగింది.
రైతులపై భారం
కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు పెంచడం వల్ల రైతులపై భారం పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలతో రైతు ఆర్థికంగా బలపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు పెంచడం వల్ల, రైతులు డీలా పడుతున్నారు.
-సుంకర అజయ్కుమార్, రైతు బంధు సమితి మండల కన్వీనర్, మునగాల