సూపర్ మార్కెట్కు వెళ్లినప్పుడు ఆపిల్ కొనాలని ఉన్నా, ఆ నిర్ణయాన్ని మార్చుకొని రుచికరమైన చాక్లెట్ కొన్నారా? అయితే, మీ మనసు ఆరోగ్యాన్ని కాకుండా, రుచినే కోరుకుంటున్నట్టు అర్థం. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఆరోగ్యకరమైన డైట్ను ఎంచుకోవడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు. డ్యూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. ఆరోగ్యం కంటే రుచికే మెదడు అధిక ప్రాధాన్యం ఇస్తుందట. దీనివల్లే, చాలామంది అనారోగ్యకరమైన ఆహారం వెంట పడుతున్నారని డ్యూక్ సైకాలజిస్టులు, న్యూరోసైన్స్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. దీనిని నిర్ధారించేందుకు 24 ఏండ్ల వయసున్న 79 మంది యువకులపై ఓ అధ్యయనం జరిపారు. ఇందులో పాల్గొన్నవారికి నాలుగు గంటలపాటు ఏమీ పెట్టకుండా.. ఆ తర్వాత వారి ముందు పూర్తి ఆరోగ్యకరమైన, ఆరోగ్యకరం కాకపోయినా రుచికరమైన ఆహార పదార్థ్థాలను ఉంచారు. చాలామంది, వెంటనే రుచికరమైన ఆహారాన్ని ఎంచుకున్నారట. ఆరోగ్యకరమైన పదార్థాలను ఎంచుకోవడానికి కొంత సమయం తీసుకున్నారట. పోషక విలువలతోకూడిన ఆహారం ప్రాధాన్యాన్ని ఎంత వివరించినా, మనసు రుచికే ఓటేసిందట. రుచి కావాలా? ఆరోగ్యం కావాలా? అన్న ప్రశ్నవస్తే, మనసు మాట వినకుండా ఆరోగ్యాన్ని గెలిపించాలి. అప్పుడే మనం గెలుస్తాం.