వంగూరు, జూన్ 21: హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారికి 2కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. రైతువేదిక, డంపింగ్యార్డు, శ్మశానవాటిక తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పచ్చదనంతో కళకళలాడుతున్నది. గ్రామంలో 1,400 జనాభా, 829మంది ఓటర్లు ఉన్నారు. గతంలో ఈ గ్రామ పంచాయతీ తిరుమలగిరితోపాటు మరో రెండు గిరిజన తండాలతో అనుబంధంగా ఉండేది. కొత్త పంచాయతీల ఏర్పాటుతో ఇతర గ్రామాలు విడిపోయాయి. తిప్పారెడ్డిపల్లికి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ శిరీషావెంకటేశ్వర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను సక్రమంగా వినియోగిస్తూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా రెండు పాడుబడ్డ బావులను పూడ్చారు. మురుగు చేరే ప్రదేశాన్ని పూడ్చి పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశారు. రూ.22లక్షలతో రైతువేదిక, రూ.14 లక్షలతో డంపింగ్యార్డు, శ్మశానవాటిక నిర్మించారు. రూ.8లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామంలోని 249 ఇండ్లు ఉండగా వందశాతం మరుగుదొడ్లు నిర్మించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధులు, రోడ్లకిరువైపులా మొక్కలు నాటడంతో గ్రామం పచ్చదనాన్ని పర్చుకున్నది.