హైదరాబాద్ : ఆరు నెలలు కష్టపడండి.. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ది కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో భాగంగా తాను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అన్ని అవకాశాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించినా కూడా, నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించకోపోవడం నేరమన్నారు. నేల విడిచి సాము చేయడం మనకు అలవాటయ్యింది. మన పక్కన్నే చేయవలసినంత పని ఉంది. అది ఒదలి ఎక్కన్నో ఏదో చేయాలనుకోవడం సరికాదన్నారు. ఒక జిల్లాలో అదనపు కలెక్టరు తాను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తమని సీఎం అన్నారు.
దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎస్కే డే మార్గదర్శకత్వంలో ఒక ఉద్యమంలా రూపుదిద్దుకున్న కమ్యూనిటీ డెవలప్మెంట్ మెంట్(సీడీ) కార్యక్రమం, ఆ తర్వాత క్రమంలో పంచాయతీరాజ్ ఉద్యమంగా ప్రారంభమైందన్నారు. అదే తరహాలో కోఆపరేటివ్ మూవ్మెంట్ కూడా పురుడుపోసుకున్నదని సీఎం అన్నారు. కాగా రాను రాను పంచాయతీరాజ్ వ్యవస్థను పొలిటికలైజేషన్ కు గురి చేసి అక్కడితో ఆగకుండా డిపార్ట్మెంటలైజేషన్ చేసి దాన్ని కంపార్ట్మెంటలైజేషన్ చేసి ఎస్కే డే కలలుగన్న స్పూర్తిని దెబ్బతీసారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణలో ఇప్పటికే ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటూ ప్రగతిపథంలో సాగిపోతున్న పంచాయతీరాజ్ వ్యవస్థను ఎస్కే డే ఆశయాలకు అనుగుణంగా మరింత గొప్పగా తీర్చిదిద్దే బాధ్యతను యువ అదనపు కలెక్టర్లు తమ భుజాలమీదికెత్తుకోవాలని, పల్లె ప్రగతి పథంలో డీపీవోలను తమ వెంట నడిపించుకుపోవాలని సీఎం పిలుపునిచ్చారు.