విద్యానగర్, జూన్ 8: మృగశిరకార్తె ప్రారంభంతో ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా చేపలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఏటా ఈ ప్రత్యేక రోజు వాటిని ఆహారంగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేసి తీసుకువెళ్లడం కనిపించింది.
ఎందుకంత ప్రాముఖ్యత?
మృగశిర కార్తె తర్వాత ఎండలు తగ్గిపోతాయి. వర్షాలు మొదలవుతాయి. 15రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె రోజు చేపలు తినడం పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీనివల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తెలో వర్షాలు మొదలుకానున్న నేపథ్యంలో పలు వ్యాధు లు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెకాలంటే చేపలు తినాల్సిందే. శాకాహారులు మాత్రం ఇంగువను బెల్లంలో కలుపుకొని.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో కలిపి వండుకొని తినేవారు. ప్రస్తుతం ఎవరి అభిరుచికి తగ్గ రీతిలో వారు వండుకొని ఆహారంగా తీసుకుంటున్నారు.
ధరలు రెట్టింపు..
లాక్డౌన్ కారణంగా సమయం తక్కువగా ఉండడంతో అమ్మకా లు అంతంత మాత్రమే జరిగాయి. అయినా ధరలు రెట్టింపయ్యాయి. కరీంనగర్లోని పెద్ద కూరగాయల మార్కె ట్, కశ్మీర్గడ్డ, డ్యాం, చింతకుంట, రాంనగర్, రేకుర్తి, సుభాష్నగర్లో అమ్మకాలు జరిగాయి. అలాగే పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చెరువులు, కుంటల వద్ద విక్రయాలు జోరుగా సాగాయి.