రియో డి జానరో: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో.. రియో డి జానరో వీధుల్లో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది బైకర్లతో ఆయన పరేడ్ నిర్వహించారు. నగరంలో ఉన్న వీధులన్నీ తిరుగుతూ.. మేటి బీచ్లను కూడా ఆయన టచ్ చేశారు. నిజానికి బ్రెజిల్లో కరోనా వల్ల ఇప్పటికే 4.5 లక్షల మంది మరణించారు. దీంతో ఆయన పాపులారిటీకి మచ్చ వచ్చింది. అయితే ప్రజల్లో మళ్లీ మద్దతును కూడగట్టుకునేందుకు బొల్సనారో భారీ సంఖ్యలో తన కార్యకర్తలతో బైక్ పరేడ్ నిర్వహించారు. మహహ్మారి కరోనా వేళ బొల్సనారో సరైన విధానాలను అవలంబించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపై సేనేట్ కమిషన్ ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టింది.
ఆదివారం జరిగిన బైక్ ర్యాలీ.. రియో ఒలింపిక్ పార్క్ నుంచి ప్రారంభమైంది. సుమారు గంటన్నర సేపు అధ్యక్షుడు బొల్సనారో ర్యాలీలో పాల్గొన్నారు. పనేమా, కోపకబానా బీచ్ల మీదుగా ఆయన పరేడ్ సాగింది. దారి పొడువునా ఉన్న ఆయన మద్దతుదారులు జెండాలు ఊపుతూ కనిపించారు. అయితే మాస్క్ లేకుండా.. కేవలం హెల్మెట్తో మాత్రమే బొల్సనారో ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పటికే కోవిడ్ నిబంధనలు ఉల్లఘించిన అధ్యక్షుడు బొల్సనారోపై మరనహో రాష్ట్రం జరిమానా విధించింది. మాస్క్ ధరించకుండా ఉన్న వందలాది మంది ప్రజలకు ఆయన ఓ ఈవెంట్లో భూపట్టాలు అందించారు. ఆ ఘటన సందర్భంగా బొల్సనారోకు ఫైన్ వేశారు. వచ్చే ఏడాది బ్రెజిల్లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది.