వారసత్వ సంపదను వెలికితీసిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరులో ప్రాచీనకాలంనాటి నాలుగు శిల్పాలు బయటపడ్డాయి. వాటిలో రెండు వీరగల్లు, ఒకటి నాగవిగ్రహం, మరొకటి రాష్ట్ర కూటులనాటి కాలభైరవ శిల్పం. కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు రామోజు హరగోపాల్, కొలిపాక శ్రీనివాస్ కొంతకాలంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వారసత్వ సంపదను వెలికితీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకునూరులో పరిశోధనలు సాగిస్తున్నారు. ఇటీవలే స్థానిక పాటిగడ్డ ప్రాంతంలో జైన సర్వతోభద్రశిల లభించింది. తాజాగా బయటపడిన రెండు వీరగల్లులలో ఒకటి రాష్ట్రకూట కాలానికి చెందిన అలంకృత వీరశిలగా చెప్తున్నారు. ఈ వీరశిలలో వీరుడు సర్వాభరణాలు ధరించి ఉన్నాడు. కుడిచేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు ధరించి యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు. నడినెత్తిన కొప్పు, నడుముకు పట్టాకత్తి ధరించి ఉన్నాడు. ఈ వీరుడు అమరుడైనాడని తెలుపడానికి సూచికగా ఇద్దరు అప్సరాంగనలు వీరుని తలకు రెండు వైపులా నిల్చొని వింజామరలు వీస్తున్నారు. రెండో వీరగల్లులో వీరుని సిగ కుడిపక్కకు కట్టి ఉన్నది. వీరుడు బల్లెంతో శత్రువుపై దాడికి సిద్ధంగా ఉన్నట్లున్నది. వీరుని నడుముకు పెద్ద కత్తి ఉన్నది. ఇది కాకతీయపూర్వశైలిలో చెక్కబడిన వీరగల్లుగా వారు చెప్తున్నారు. నాగవిగ్రహానికి నాగముచుళింద పోలికలున్నట్లు, కాలభైరవ శిల్పం రాష్ట్రకూటుల కాలంనాటిదని వారు వివరించారు.