బెంగళూరు, మే 23: దేశంలో వ్యాక్సిన్ల కొరత నెలకొన్న నేపథ్యంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిశోధకులు శుభవార్త చెప్పారు. ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లను కూడా కట్టడి చేసే శక్తిమంతమైన, సమర్థవంతమైన టీకాను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. దేశీయ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు గది ఉష్ణోగ్రత వద్ద కూడా దీన్ని నిల్వ ఉంచేలా సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొవిడ్-19 కట్టడికి ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల కంటే ఎంతో మెరుగ్గా పనిచేసే కొన్ని మాలిక్యూల్స్ను కనుగొన్నట్టు ఐఐఎస్సీలోని మాలిక్యులర్ బయోఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ తెలిపారు. ఇవి ప్రతిరోధకాలను తటస్థీకరించి, వైరస్ను కట్టడి చేస్తాయన్నారు. ఇప్పటికే ఎలుకలు, చిట్టెలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు చెప్పారు. కొవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తుల్లో తయారయ్యే యాంటీబాడీలతో (ప్రతిరక్షకాలతో) పోలిస్తే, ఈ మాలిక్యూల్స్ ఎనిమిది రెట్లు ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలను తయారు చేశాయన్నారు. వీటి సాయంతోనే తాము టీకాను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు.
కొత్త స్ట్రెయిన్లు వస్తున్నాయనే..
గత సెప్టెంబర్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను ప్రారంభించామని, అయితే నిధులు లేకపోవడంతో నిలిపివేశామని వరదరాజన్ తెలిపారు. అనంతరం కరోనా కట్టడికి కొన్ని టీకాలు అందుబాటులోకి రావడం, కేసులూ తగ్గడంతో తమ ప్రయోగాలను పూర్తిగా పక్కనబెట్టినట్టు వెల్లడించారు. అయితే, ఇటీవల దేశంలో సెకండ్ వేవ్ విజృంభణ, టీకాల కొరత, కొత్త స్ట్రెయిన్ల దాడుల నేపథ్యంలో వ్యాక్సిన్ అభివృద్ధిని పునఃప్రారంభించామని చెప్పారు. నిధుల విడుదల కూడా దీనికి కలిసొచ్చిందన్నారు. తమ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే క్లినికల్ డెవలప్మెంట్, మనుషులపై ట్రయల్స్ నిర్వహించాల్సి ఉన్నదని.. దీనికి 10-11 నెలల సమయం పట్టొచ్చన్నారు. మొత్తంగా మార్కెట్లోకి తమ టీకా అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది పడుతుందన్నారు.