న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి రెండో దశలో భారీగా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 329 మంది వైద్యులు కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్లో 80 మంది మరణించారు. ఆ తర్వాత ఢిల్లీల్లో 73 మంది, ఉత్తర ప్రదేశ్లో 41 మంది, ఆంధ్రప్రదేశ్ 22 మంది, తెలంగాణ 20 మంది మృతి చెందారని పేర్కొంది. ఐఎంఏ కొవిడ్-19 రిజిస్ట్రీ ప్రకారం.. మొదటి వేవ్లో 748 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందారు.
ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జేఏ జయలాల్ వైద్యుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులందరికీ టీకాలు పూర్తి స్థాయిలో వేయకపోవడమే మరణాలకు ప్రధాన కారణమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కరోనా కరోనా కారణంగా రోజుకు సగటున 20 మంది వైద్యులు మరణిస్తున్నారని పేర్కొన్నారు. వీరిలో ప్రభుత్వ సౌకర్యాలు, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో పని చేసే వైద్యులు ఉన్నారన్నారు. ‘మహమ్మారి సెకండ్ వేవ్ అందరికీ ముఖ్యంగా కొవిడ్కు వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న వారికి చాలా ప్రాణాంతకమైందని’ జయలాల్ ఇంతకు ముందు పేర్కొన్నారు.