‘నా భీమ్ హృదయం బంగారం లాంటిది. కానీ ధిక్కారం ప్రకటిస్తే మాత్రం సర్వశక్తితో, ధీరోదాత్తుడిగా పోరాటానికి సిద్ధమవుతాడు’ అంటూ కొమురం భీమ్ పాత్ర గురించి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న చారిత్రక కాల్పనిక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ బల్లెం చేతబూని ఉగ్రరూపంలో దర్శనమిస్తున్నారు. ఈ లుక్ సోషల్మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒలీవియా మోరీస్, అలియాభట్ కథానాయికలు. కరోనా ప్రభావంతో చిత్రీకరణ వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గురువారం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ సినిమాను ప్రకటించింది. ‘ఎన్టీఆర్ 31వ చిత్రమిది. గొప్ప ప్రయాణానికి నాందిపలుకుతున్నాం. భారీ హంగులతో సినిమాను తెరకెక్కించబోతున్నాం’ అని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్నీల్ కలిసి తీయించుకున్న ఫొటోను పంచుకుంది.