హైదరాబాద్ : ఆక్సిజన్ కొరత కారణంగా కింగ్ కోఠి ఆస్పత్రిలో కరోనా మరణాలు సంభవించాయని పలు మీడియా ఛానెల్లో వస్తున్న వార్తలపై డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డాక్టర్ కే రమేశ్ రెడ్డి సోమవారం స్పందించారు. కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ముగ్గురు కరోనా రోగులు చనిపోయారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కోఠి హాస్పిటల్లో 13 కేఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ఉందని తెలిపారు.
అయితే ఆ ముగ్గురు రోగులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రతి రోజు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గతేడాది కాలం నుంచి కరోనా రోగులకు అత్యుత్తమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు చనిపోలేదు. ఇలాంటి వార్తలను చూసి ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దు. ఆ వార్తలు అవాస్తవమని డీఎంఈ రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు.