న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి దేశవ్యాప్తంగా కఠిన నియంత్రణలు తప్పవని ప్రముఖ బ్యాంకర్, సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కొటక్ అన్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ ప్రజల ప్రాణాలను కాపాడటం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా ఆర్థిక కార్యకలాపాలను నిరోధించడం సహా జాతీయ స్థాయిలో పటిష్ట చర్యలు చేపట్టాలని కొటక్ సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే అత్యవసర ప్రాతిపదికన ఆరోగ్య మౌలిక వసతులను పటిష్టం చేయాలని అన్నారు. వైరస్ బారినపడిన వారికి వైద్య సేవలు మెరుగుపరిచేలా ఆక్సిజన్ పడకలు, ఐసీయూ బెడ్లు, మందుల సరఫరాను పెంచాలని సీఐఐ ఓ ప్రకటనలో పేర్కొంది. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది సరిపోరని ఆందోళన వ్యక్తం చేసింది.